రంగారెడ్డి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : జిల్లా కూరగాయల సాగుకు పెట్టింది పేరు. అవసరాలకు సరిపడా కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ నగర వాసులకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుండడంతో సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ఉద్యానవన శాఖ సంకల్పించింది. మార్కెట్లలో కూరగాయల ధరలు ఆకాశన్నంటడం..వేసవిలో కూరగాయల కొరత ఏర్పడి ధరలు మరింత పైపైకి ఎగబాకే అవకాశం ఉండడంతో కొరతను అధిగమించేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి సీజన్లోనూ 30 వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తుండగా..విస్తీర్ణాన్ని మరో 10 వేల ఎకరాలకు పెంచేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ స్టడీ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 325 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 200 గ్రాములు తీసుకున్నా.. జిల్లా జనాభాకు తగ్గట్టు ఏడాదికి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. జిల్లా లో ఇంతకంటే ఎక్కువగానే అంటే 1.95 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు పండుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరవాసుల అవసరాలను సైతం జిల్లాలో పండిన కూరగాయలే తీరుస్తుండడంతో ఇంకా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల అవసరం ఏర్పడుతున్నది. ఈ కొరతను అధిగమించాలంటే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని మరో 10 వేల ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యానవన శాఖ భావిస్తున్నది. ఈ మేరకు అవగాహన సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యపరుస్తున్నది.
జిల్లాలోని అనేక పల్లెలు కూరగాయల సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా రైతు కుటుంబాలు కూరగాయలను పండిస్తూ బతుకుతున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతాలు క్యారెట్ సాగుకు పేరుగాంచాయి. అలాగే ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్ ప్రాంతాల్లో ఆకు
కూరలు, షాద్నగర్లో పచ్చిమిర్చి అధికంగా పండుతున్నది. ఉల్లిగడ్డ, ఆలుగడ్డల సాగుకు ఇక్కడి భూములు యోగ్యంగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. వివిధ రకాల కూరగాయలతోపాటు, పాలకూర, చుక్కకూర, పొనగంటి కూర, మెంతికూర, ఎర్ర గోంగూర వంటి కూరగాయలను పండిస్తూ జిల్లా రైతాంగం ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నది.
జిల్లా అవసరాలకు పోగా..మిగిలిన కూరగాయలు హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే హైదరాబాద్కు చెంతనే ఉన్న రంగారెడ్డి జిల్లా గత పదేండ్ల కాలంలో నలువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం కూరగాయల సాగుపై ప్రభావం పడింది. పెద్ద ఎత్తున పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతుండడం..వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడంతో కూరగాయల సాగు క్రమక్రమంగా తగ్గిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కూరగాయల సాగును ప్రోత్సహించి గత వైభవాన్ని జిల్లా చాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూరగాయకైనా మంచి డిమాండ్ ఉంటున్నది. ఇక వచ్చేది వేసవి కాలం. కూరగాయలు దొరకడం మరీ కష్టం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత యాసంగిలో జిల్లా రైతాంగం కూరగాయల పంటలనే సాగు చేయాలని ఉద్యానవనశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకం కూరగాయకైనా కిలో రూ.60 ధర పలుకుతున్నది. ఇతర పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతో మూడింతల లాభాన్ని రైతులు పొందొచ్చు. గతంలో సరైన నీటి వనరులు లేక రైతులు కూరగాయల సాగుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడా ఇబ్బంది లేదు.
పుష్కలమైన సాగునీరు అందుబాటులో ఉన్నది. కూరగాయలను విక్రయించుకునేందుకు రవాణా వ్యవస్థ సైతం మెరుగుపడింది. ఎకరం వరి సాగుకు ఉపయోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కూరగాయలను సాగు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. వచ్చేది వేసవి కాలం కావడంతో మంచి ధర పలికే అవకాశం ఉన్నందున యాసంగిలో అధిక విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయాలని అధికారులు కోరుతున్నారు.
కూరగాయల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పాలీ హౌస్, నెట్హౌస్లలో కూరగాయలను సాగుచేసేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నది. జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నాణ్యమైన విత్తనాల కొనుగోలు చేయడంలో సహకరించడంతోపాటు సబ్సిడీపై కూరగాయల మొక్కలను అందజేస్తున్నాం. ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కూరగాయలను సాగు చేయాలని సూచిస్తున్నాం. ఇందుకు సంబంధించి స్ప్రింక్లర్లను ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం చొప్పున ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నది. రైతు లు సద్వినియోగం చేసుకుని కూరగాయల సాగును మరింతగా పెంచాలి.
-నీరజాగాంధీ, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి