కులకచర్ల : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని అన్ని హంగులతో అలంకరించారు. ఉత్సవాలకు స్వరం సిద్ధం చేశారు. 2 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణమాసం చివరి సోమవారం.. ఉగాదికి ముందు 12 రోజులపాటు ఉత్సవాలు కనులవిందుగా కొనసాగుతాయి. ఏకశిలా పర్వతంగా పేరుపొందిన పాంబండ క్షేత్రం కులకచర్ల నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పాంబండ విశిష్టత
సుమారు కిలోమీటర్ వరకు పాంబండ రాతిబండతో వెలసి ఉంది. ఈ బండ పాములా వంకరలు తిరిగి ఉంటుంది. దేవాలయం వెనుక భాగం పాము నాలుకలా కనిపిస్తుంది. గతంలో పాము బండ మధ్యలో నుంచి వెళ్లడం వలన బండ రెండుగా చీలిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. పాము రాతిగా మారిందని.. అందువల్ల ఈ బండకు పాముబండగా పేరు రాగా.. కాలక్రమేణా పాంబండగా రూపాంతరం చెందింది.
గుండం విశిష్టత
అతిపెద్దదైన బండ, మధ్యలో కోనేరు, కోనేరులో ఎప్పుడూ నీరు ఉంటుంది. ఇది అక్కడి విశిష్టత. త్రేతాయుగంలో శ్రీరాముడు తాను స్థాపించిన లింగానికి పూజలు నిర్వహించడానికి జలం అవసరం కాగా.. శ్రీరాముడు తన బాణాన్ని సంధించి బండ మధ్యలో వేయడంతో కోనేరు ఏర్పడిందని.. ఆ నీటితో లింగానికి అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. మూడు కాలాలపాటు గుండంలో నీరు ఎండిపోకుండా ఉంటుంది. ఈ గుండంలో స్నానమాచరిస్తే పాపాలు హరిస్తాయని, గుండం నీటిని చలితే చీడపురుగులు పోతాయని ప్రజల నమ్మకం.