పూడూరు, మే 24: డ్రగ్స్ చాక్లెట్ల విక్రయదారులపై ప్రత్యేక నిఘాపెట్టాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీపీ మల్లేశం ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజక వర్గంలోని పాఠశాలల వద్ద ఐస్ క్రీమ్ వ్యాపారులు కొందరు పిల్లలకు చాక్లెట్లలో డ్రగ్స్ గంజాయి కలిపి విక్రయిస్తునట్లు తెలిసిందని వారిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక నిఘాపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
మంచినీరు, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులు నివేదికలను ఇవ్వాలని సూచించారు. మండల పరిధిలో నిలిచిపోయిన రోడ్లు, పాఠశాల భవనాల వివరాలు ఇవ్వాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను డ్వాక్రా సంఘాల మహిళలతో ఏర్పాట్లు చేసి పాఠశాలల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయించాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని తెలిపారు.
ప్రభుత్వ భూములు ఉన్న పంచాయతీల్లో అర్హులకు ఇండ్ల స్థలం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. వైద్యాధికారి పనితీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, మండల ప్రత్యేకాధికారి సుధారాణి, ఎంపీడీవో పాండు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీటీసీలు సురేందర్, అరిఫ్, సల్మాబేగం, నాగమణి, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.