పరిగి, ఆగస్టు 22 : మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎంకు సొంత జిల్లా ఎమ్మెల్యేల మద్దతు అంతంతేనని తేలింది. ఈ అంశంపై ఇప్పటివరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. కొండాకు వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్లో సీఎల్పీలో జరిగిన సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పాల్గొని కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో సొంత జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యే స్పందించకపోవడం గమనార్హం.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పేల్చిన రాజకీయ బాంబుతో కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేగడం తెలిసిందే. ఇతర జిల్లాల నుంచి సీఎం వర్గం కొండాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయగా.. పెద్దగా సఫలీకృతం కాలేదనే వార్తల నేపథ్యంలో సొంత జిల్లా ఎమ్మెల్యే స్పందన లేకపోవడం విడ్డూరం. ఈ నెల 19న కొండా సుస్మిత సీఎం రేవంత్రెడ్డి కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన తర్వాత ప్రభుత్వంలో పెద్ద దుమారం రేగడం, సీఎంకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. కాగా జిల్లాలోని పక్క నియోజకవర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఈ అంశంలో శనివారం సాయంత్రం వరకు స్పందించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డితో సఖ్యత పెంచుకునేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేయడం, తన నాలుకకు మచ్చ ఉన్నది, రేవంత్రెడ్డి సీఎం అవుతారని నేనే మొదట చెప్పానని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా సీఎం కొడంగల్ పర్యటనకు వచ్చినపుడు, హైదరాబాద్లోని అనేక కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యే పాల్గొని సీఎంకు తాను సన్నిహితంగా ఉంటున్నట్లు చెప్పుకొనే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను సైతం జిల్లాలో మీడియా, సోషల్ మీడియా ప్రచారానికి వాడుకున్నారు. తద్వారా అధికార యంత్రాంగంలో, పార్టీలో తాను సీఎంకు సన్నిహితుడినని చెప్పుకొనే ప్రయత్నం జరిగింది. కానీ అసలు సమయంలో మాత్రం సీఎంకు మద్దతుగా నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలెవరికీ మంత్రివర్గంలో చోటు దక్కకపోగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాల్సిందిగా ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని కలిసి విన్నవించారు. రామ్మోహన్రెడ్డికి మంత్రివర్గంలో చోటు విషయంలో సీఎం రేవంత్రెడ్డి నుంచి సానుకూల స్పందన లేకపోవడం వల్లే.. ఆయన పార్టీ అధిష్టానం నుంచి సాధించుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్తలున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడునాలుగు రోజులుగా సైతం ఎమ్మెల్యే ఢిల్లీలోనే ఉండటంతోపాటు మరోసారి మల్లికార్జున్ఖర్గేను కలిశారు.
19వ తేదీ తర్వాత కొండా ఎపిసోడ్పై ఎమ్మెల్యే ఎక్కడా నోరు విప్పలేదు. ఏ అంశంపైనైనా మాట్లాడే ఆయన పార్టీలో జరుగుతున్న, సీఎం రేవంత్రెడ్డిపై ఆరోపణల విషయంలో స్పందించకపోవడం గమనార్హం. ఓవైపు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సీఎంకు బాసటగా నిలువగా.. ఇన్నాళ్లు తాను సీఎంకు సన్నిహితుడినంటూ ప్రచారం చేసుకున్న ఎమ్మెల్యే అసలు స్పందించకపోవడం పార్టీ నాయకుల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. గత మూడునాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన శనివారం పరిగిలో జరిగిన ఎస్ఐఆర్పై కాంగ్రెస్ బీఎల్ఏల అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
కనీసం పరిగి సమావేశంలోనైనా, లేదంటే పత్రికా ప్రకటన రూపంలోనైనా ఎమ్మెల్యే స్పందించకపోవడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను మంత్రివర్గ రేసులో ఉండటంతో ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయారనే చర్చ సైతం జరుగుతున్నది. ఈ అంశంపై స్పందించకపోవడం వల్ల ఎమ్మెల్యే సీఎం వర్గానికి దూరం అవుతారన్నది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తద్వారా జిల్లా రాజకీయాల్లో పెద్ద ప్రభావం పడనున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎపిసోడ్తో ఎమ్మెల్యే ఎటువైపు అనేది తేలిందని సీఎం వర్గం పేర్కొంటున్నది. పరిగిలో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ సైతం పాల్గొన్నప్పటికీ కొండా ఎపిసోడ్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.