కులకచర్ల, మార్చి 11 : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది. ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను చుట్టుపక్కల ఎక్కడాలేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణమాసం చివరి సోమవారం మూడు రోజులపాటు.. ఉగాదికి ముందు 11 రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. పాంబండ ఆలయం కులకచర్ల నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆలయంలో పూజా కార్యక్రమాలు
ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు అభిషేకం, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు పూజారి పాండు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది పర్వదినం రెండు రోజుల ముందు పాంబండపై వీరశైవులు అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.
బస్ సౌకర్యం
పరిగి నుంచి మహబూబ్నగర్కు వెళ్లే బస్సులు, కోస్గి నుంచి కులకచర్ల మీదుగా షాద్నగర్ వెళ్లే బస్సుల్లో బ్రహ్మోత్సవాలకు భక్తులు చేరుకోవచ్చును.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రాత్రి హరికథ కాలక్షేపం నిర్వహిస్తారు. శ్రీరామలింగేశ్వరస్వామి భజన భక్తమండలి బండవెల్కిచర్ల, ఐనాపూర్, మోత్కూర్, గ్రామాలతోపాటు వివిధ గ్రామాల వారిచే భజన, కోలాట ప్రదర్శన నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం
ఉగాది సందర్భంగా 11 రోజులపాటు పాంబండపై నిర్వహించే రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతరలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక నీటి సౌకర్యం కల్పించాం. జాతరకు లక్షల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవాలకు పరిగి, తాండూరు, మహబూబ్నగర్, షాద్నగర్ డిపో మేనేజర్ల సహకారంతో జాతర వరకు బస్సులు నడుపబడుతాయి.
– సుధాకర్, రాములు, ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్
12న ధ్వజారోహణం, పుణ్యాహవాచనం, కలశస్థాపన. సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఆలయ అర్చకుల ఇంటి నుంచి పాంబండ గుట్టపైకి స్వామివారి ఊరేగింపు, సాయంత్రం పల్లకీ సేవ, హారతి
13న ఉదయం 10 గంటలకు రుద్రహోమం, సాయంత్రం పల్లకీ సేవ, హారతి
14న స్వామివారికి శకటోత్సవం(బండ్లు తిరుగుట), సాయంత్రం పల్లకీ సేవ, హారతి
15న సాయంత్రం పల్లకీ సేవ, హారతి
16న సాయంత్రం 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, రాత్రికి రథోత్సవం
17న ఉదయం నంది ప్రతిష్ఠాపన, లింగ ప్రతిష్ఠాపన మహోత్సవం
18న పల్లకీ సేవ, హారతి
19న పల్లకీ సేవ, హారతి
20న రాత్రికి అగ్ని గుండాలు, నిరంతర భజనలు, జంగిరెడ్డి తదితర గాయకులచే భక్తి పాటలు
21న సర్వదర్శనం
22న స్వామివారిని బండవెల్కిచర్లకు తీసుకువెళ్లుట, గ్రామంలో పంచాంగ శ్రవణానంతరం ఉత్సవాలు ముగుస్తాయి.