రంగారెడ్డి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ, ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను ఉద్దేశించి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్వో, ప్రతీక్జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు నియమించబడిన పీవో, ఏపీవోలు ప్రతి ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని.. ఇందుకుగాను ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, సహాయ ప్రిసైడింగ్ అధికారి కూడా అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా కారణంతో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించలేనప్పుడు సహాయ ప్రిసైడింగ్ అధికారి కూడా ఎన్నికలు నిర్వహించేలా సంసిద్ధంగా ఉండాలన్నారు.
రెగ్యులర్ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా నిర్వహించాలని.. ముందుగా ఎన్నికల సందర్భంగా చేయవలసినవి, చేయకూడని అంశాలను బాగా తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 9,186 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4,870 మంది పురుషులు, 4,315 మంది మహిళలు. కాగా, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారని తెలిపారు. ఏదైనా అంశం తెలియనైట్లెనా, సందిగ్ధం ఉన్నట్లయితే ఎలాంటి సంకోచం లేకుండా ముందుగానే అలాంటి విషయాలను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జడ్పీ డిప్యూటీ సీఈవో రంగారావు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ధాత్రీదేవి, సంబంధిత అధికారులు హాజరయ్యారు.