తాండూరు : సీఎం కేసీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆదర్శ మున్సిపల్గా మార్చుటకు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సోమవారం నుంచి ‘గల్లీ గల్లీకి పైలెట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మీడియాతో తెలిపారు. ఆదివారం మున్సిపల్ పాలకవర్గంతో సుదీర్ఘంగా చర్చించి వార్డుల్లో పర్యటన తేదీలను ప్రకటించారు. రోజు 6 వార్డుల్లో పర్యటన చేయనున్నట్లు తెలిపారు. 23, 24, 25 తేదీల్లో 18వార్డులు, 30, 31, 1వ తేదిల్లో మరో 18వార్డుల్లో పర్యటనకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా వార్డుల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ పాలక వర్గంతో పాటు సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది విధిగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమానికి తాండూరు ప్రజలు, అధికారులు, నేతలు సహకరించాలని కోరారు.