ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పారిశుధ్యం కోసం ప్రత్యేక స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని, మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేయాలని అన్నారు.
పారిశుధ్య సిబ్బంది కొరత ఉంటే నెల రోజుల కోసం తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. మున్సిపాలిటీకి రోజుకు వచ్చే 40 లక్షల లీటర్లకు అదనంగా మరో 30 లక్షల లీటర్లను అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ట్యాక్స్లు చెల్లించకుండా బకాయిపడ్డ వారందరి నుంచి ట్యాక్స్లు వసూళ్లు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని ఆయన సూచించారు. విద్యార్థులు డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రతి హాస్టల్, ప్రతి విద్యాసంస్థలపైన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్తో పాటు ఇతర నిషేదిత మత్తు పదార్థాలను విద్యార్థుల దరిదాపుల్లోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలో 2024-25సంవత్సరానికి రూ.13.10 కోట్ల బడ్జెట్కు మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఆమోదించింది. మున్సిపల్ ఆదాయం పెంచటంతో పాటు కొత్తగా విస్తరిస్తున్న కాలనీల్లో సౌకర్యాలు కల్పించటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఏసీపీ పీవీరాజు, తహసీల్దార్ సునిత, సీడీపీవో శాంతిశ్రీ, మిషన్భగీరథ అధికారి ప్రియాంక, ఆర్అండ్బీ డీఈ వేణుగోపాల్రెడ్డి, ఆర్టీసీ డీఎం వెంకటనర్సప్ప, మిషన్భగీరథ డీఈ యాదయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.