ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 27 : పల్లె సీమల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగన్పల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, ముకునూరు గ్రామాల్లో రూ.64లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో రూ.10లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు.
పోల్కంపల్లి గ్రామంలో రూ.20లక్షలు, దండుమైలారం గ్రామంలో రూ.5లక్షలతో పలు అభివృద్ధి పనులు, ముకునూరు గ్రామంలో రూ.19లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, సర్పంచ్లు జగన్, చెరుకూరి ఆండాళు, రవణమోని మల్లీశ్వరి, జ్యోతి, ఎంపీటీసీలు చెరుకూరి మంగ, పిట్టల అనసూయ, అరుణమ్మ, జ్యోతి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ గురునాథ్రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ లక్ష్మణ్రావు పాల్గొన్నారు.