దుండిగల్,సెప్టెంబర్ 8: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టి.శ్రీనివాసకుమార్ అన్నారు. బుధవారం ఇన్కాయిస్లో ‘రీజనల్ వర్క్షాప్ ఆన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) ఫర్ బ్రాడ్కాస్టింగ్ మీడియా అండ్ సునామీ వార్నింగ్ చైన్’ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సునామీలను ఇన్కాయిస్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుందన్నారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండగా.. అధికారిక సంస్థలైన ఇన్కాయిస్ నుంచి గాని ఎన్డీఎంఏ నుంచి నిర్ధిష్టమైన సమాచారం అందుకున్న తర్వాతే ప్రసారం చేయాలన్నారు. సదస్సులో ఇన్కాయిస్ గ్రూప్ డైరెక్టర్ డా.టీఎం బాలకృష్ణన్ నాయర్, శాస్త్రవేత్తలు బి.అజయ్కుమార్, సీహెచ్.పతాంజలి కుమార్, ఎంవీ.సునంద, డా.సుధీర్జోసేఫ్ పాల్గొన్నారు.