మేడ్చల్ రూరల్, అక్టోబర్ 2: ప్రస్తుత సాంకేతిక యుగంలో అవకాశాలను అంది పుచ్చుకోవాలని, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సంపదను సృష్టించే స్థాయికి ఎదగాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వీసీ కట్టా నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, గౌరవ అతిథిగా టెక్ మహింద్రా డెలివరి హెడ్ మల్లాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ, గతంలోలా కాకుండా ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే అపార జ్ఞానాన్ని సముపార్జించవచ్చన్నారు. సాంకేతికతకు సృజనాత్మక ఆలోచనలను జోడించి, ఉద్యోగాలను, సంపదను సృష్టించాలన్నారు. తాము చదువుకునే కాలంలో అవకాశాలు తక్కువగా ఉండటంతో విషయ పరిజ్ఞానం కోసం చాలా కష్టాపడాల్సి వచ్చేదని తెలిపారు. నేడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నా విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఉంటున్నాయని తెలిపారు. విద్యార్థి జీవితమంటేనే తెలుసుకోవడమని, సమాజంలో అడుగుపెట్టడానికి ముందే సంసిద్ధతను సంపాదించుకోవాలన్నారు.
క్రమశిక్షణ, ప్రణాళికతో కష్టపడే తత్వాన్ని జోడిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించడం కష్టమేమి కాదన్నారు. ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగి, సమాజంలో పది మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బాలరెడ్డి, కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత, ఉప్పల రాజేశ్వర్, టీవీ రెడ్డి, అనురాగ్, పీఆర్వో సుధాకర్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.