కేపీహెచ్బీ కాలనీ, మే 15 : దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణను తయారు చేసింది. సులువైన పద్ధతిలో వేగవంతంగా చెత్తను తరలించేందుకు ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ఆచరణ దిశగా ముందుకు సాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతి ఇంటినుంచి చెత్తను సేకరించడం..సేకరించిన చెత్త, వ్యర్థాలను నగర శివారు ప్రాంతాలకు తరలించడంలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టిని సారించిన అధికారులు సకాలంలో డంపింగ్ యార్డుకు తరలించడంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలు (జీవీపీ పాయింట్స్), డస్ట్బిన్ తొలగించిన ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి నూతన విధానాలను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డుకు సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ విధానం వల్ల బస్తీలు, కాలనీల నుంచి చెత్తను సెకండరీ పాయింట్కు వేగంగా చెత్తను తరలించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో గృహాల నుంచి చెత్తను సేకరించవచ్చని జీహెచ్ఎంసీ గుర్తించింది.
మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లతో పాటు సమీపంలోని పలు సర్కిళ్లకు చెందిన చెత్తాచెదారం, వ్యర్థాలు కైత్లాపూర్ సమీపంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించి అక్కడినుంచి జవహర్నగర్కు తరలిస్తున్నారు. పలు సర్కిళ్లకు ఒకటే ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉండడం వల్ల దూర ప్రాంతాలలో చెత్తాచెదారం సేకరించే స్వచ్ఛ ఆటోలు, వాహనాల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించిన చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లో వదిలి మరలా దూర ప్రాంతానికి వెళ్లి చెత్తాచెదారాన్ని సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడంతో కాలయాపన జరుగుతుంది. ఒక వాహనం రోజుకు రెండుసార్లు కూడా చెత్తను తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ స్టేషన్లో వేయలేక పోతున్నారు. ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులు.. మరోవైపు వాహనాల డీజిల్ ఖర్చులు పెరగడం.. సమయం వృథా అవుతుంది. ఈ కారణాలతో రోజుల తరబడి ఆయా ప్రాంతాల్లో రోడ్లపైనే చెత్తాచెదారం ఉండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిళ్లల్లోని వార్డుకు ఒకటి చొప్పున సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూసాపేట సర్కిల్ పరిధిలో ఆరు ఎస్సీటీపీలు ఏర్పాటు నిర్ణయించగా ఇప్పటికే కైత్లాపూర్ ట్రాన్స్ఫర్ స్టేషన్తో పాటు ఫతేనగర్లో ఎస్సీటీపీల సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా బాలాజీనగర్, అల్లాపూర్, కేపీహెచ్బీ కాలనీ, మూసాపేట డివిజన్లలోని నాలుగు ప్రాంతాల్లో ఎస్సీటీపీలను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. త్వరలోనే ప్రతి వార్డులో ఎస్సీటీపీ కేంద్రాలు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణలో మార్పులు తెస్తున్నాం. ఇంటింటికి చెత్తను సేకరించడం… ఆ చెత్తను శివారు ప్రాంతాలకు తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టిసారించాం. వార్డులకు అందుబాటులో సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ ఉండడం వల్ల ఆయా వార్డుల పరిధిలో సేకరించిన చెత్తాచెదారం వెంటనే శివారు ప్రాంతాలకు తరలించొచ్చు. దీంతో చెత్తను తరలించే వాహనాల డీజిల్ ఖర్చులు తగ్గడం.. సమయం ఆదా అవుతుంది. ఒక స్వచ్ఛ ఆటో ఎక్కువ ట్రిప్పులు చెత్తను సేకరించడం వల్ల కాలనీలు, బస్తీలలో చెత్తాచెదారం ఉండదు. ఎస్సీటీపీలను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను జోనల్ కమిషనర్ మమత, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్కిల్ పరిధిలో కొత్తగా నాలుగు ఎస్సీటీపీలు అందుబాటులోకి తెస్తాం.- కె.రవికుమార్, ఉప కమిషనర్, మూసాపేట సర్కిల్