బండ్లగూడ, మే 24: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్గా మద్దెల లతాప్రేమ్గౌడ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. గత మేయర్ మహేందర్గౌడ్పై అవినీతి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానం చేసిన విషయం విదితమే. కార్పొరేషన్లో ప్రస్తుతం 21మంది కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేషన్ కార్యాయంలో ఆర్డీవో (రిటర్నింగ్ అధికారి) వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నూతన మేయర్ ఎన్నిక జరిగింది.
మేయర్ అభ్యర్థిగా లతప్రేమ్గౌడ్ను డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి బలపర్చగా, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డిని కార్పొరేటర్ రవీందర్రెడ్డి బలపర్చరారు. 17 మంది కార్పొరేటర్లు హాజరై చేతులు తమ సమ్మతి తెలిపారు. ఆర్డీవో వెంకట్రెడ్డి మేయర్ లతతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమిషనర్ శరత్చంద్ర సమక్షంలో వారు బాధ్యతలను స్వీకరించారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని స్థానిక కార్పొరేటర్ల సహాయంతో పరిష్కరానికి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ లత తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమయాత్సాగర్ నుంచి నీటిని విడుదల చేయించి కార్పొరేషన్కు నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా బాధ్యతలు స్వీకరించిన లతాప్రేమ్గౌడ్కు ఎంపీ రంజిత్రెడ్డి, రాష్ట్ర పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో పాటు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.