ఓ విద్యార్థినికి పాఠశాలలో ఇచ్చిన ప్రాజెక్టు వర్క్ మరెందరో విద్యార్థులకు మేలు చేసింది. అంతకుమించి పర్యావరణహితానికి దోహదపడింది. నిరుపయోగంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన ఆ విద్యార్థినికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పాఠశాల స్థాయిలోనే సామాజిక సేవా దృక్పథంతో ఆ విద్యార్థిని వేసిన ముందడుగు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆమె ఆలోచనలకు కుటుంబసభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు చేయూత ఇవ్వడంతో ఇన్ఫ్రాగ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పాఠశాల విద్యార్థులకు బెంచీలను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది ఓక్రిడ్జి పాఠశాల విద్యార్థిని అనాహిత ప్యాట్నీ.
– శేరిలింగంపల్లి, నవంబర్ 28
ఖాజగూడలోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుకుంటున్న అనాహిత ప్యాట్నీ తన వ్యక్తిగత ప్రాజెక్టులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి బెంచీలు తయారు చేసింది. తల్లిదండ్రుల సహకారంతో ఇన్ఫ్రాగ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలువురి నుంచి విరాళాలు సేకరించింది. వాటితో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన బెంచీలను బాలల దినోత్సవం రోజున ఖాజగూడలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు అందజేసింది.
55 బెంచీలు ఇచ్చేందుకు ప్రణాళిక
ఖాజగూడలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 2, 4వ తరగతి విద్యార్థుల కోసం 55 బెంచీలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 24 బెంచీలను అందజేసింది. ఇందుకోసం దాదాపు 900కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించింది. వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా 24 బెంచీలను తయారు చేసింది. వాటిని ఓక్రిడ్జి పాఠశాల ప్రిన్సిపాల్ చేతులమీదుగా కుటుంబసభ్యుల సమక్షంలో ఖాజగూడ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు అందజేసింది. మిగతా బెంచీలను త్వరలో అందజేసేందుకు కృషి చేస్తోంది. ఇదే తరహాలో ఇంటి పైకప్పులు సైతం తయారు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్లాస్టిక్ రీసైక్లింగ్తో ప్రయోజనాలు
ప్లాస్టిక్ వ్యర్థాలతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. పర్యావరణానికి ఇది ఎంతో హానికరం. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ఫ్రాగ్రీన్ సంస్థ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి, బెంచీలను తయారు చేస్తున్నాం. వీటిని ఖాజగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేశాం. ఇప్పుడు బెంచీలతో పాటు పైకప్పు రేకులను తయారు చేస్తున్నాం. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.
– అనాహిత ప్యాట్నీ
అనాహిత చేయూత అభినందనీయం
నెల క్రితం అనాహిత ఓ డ్రాయింగ్ కాంపిటీషన్లో భాగంగా మా పాఠశాలకు వచ్చింది. ఇక్కడ విద్యార్థుల అవసరాలను గుర్తించి ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా బెంచీలను రూపొందించి అందజేయడం సంతోషకరం. పాఠశాల విద్యార్థులకు 55 బెంచీలను అందించేందుకు అంగీకరించి అందులో 24 బెంచీలను బాలల దినోత్సవం రోజున మా పిల్లలకు ఇచ్చింది. చిన్న వయస్సులోనే ఎంతో ఉత్తమంగా ఆలోచించి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం అభినందనీయం.
– శ్యామల, ప్రధానోపాధ్యాయురాలు, ఖాజగూడ ప్రభుత్వ పాఠశాల