ప్రతి ఒక్కరిలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు ప్రాధాన్యం కల్పిస్తూ పోటీలను నిర్వహిస్తూ బహుమతులను అందజేస్తున్నది. 2023 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశమని, పోటీలకు సన్నద్ధం కావాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ పిలుపునిచ్చింది.
-రంగారెడ్డి, జూలై 13(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ‘కొత్త ఆలోచనలకు పదునుపెట్టి.. వాటికి సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేపట్టే వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేటా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తున్నది. అలాగే.. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా ప్రతి యేడు ‘ఇన్స్పైర్ మనక్’ పోటీలను నిర్వహిస్తున్నది. వినూత్నంగా.. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆవిష్కణ రూపకర్తలకు ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఈ కార్యక్రమాలకు మంచి అవకాశం కాగా.. పోటీలకు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ కూడా పిలుపునిస్తున్నది.’
సృజనాత్మకతను చాటే ‘ఇంటింటా ఇన్నోవేషన్’
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సృజనాత్మకతను ప్రోత్సహించడంతోపాటు స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నారు. 2019 నుంచి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 2023 సంవత్సరానికీ దరఖాస్తులను టీఎస్ఐసీ ఆహ్వానిస్తున్నది. పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు రైతులు, మహిళలు, యువకులు, విద్యావేత్తలు.. ఇలా ఎవరైనా సరే.. తమ ప్రాంతాల్లో నెలకొన్న సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలను రూపొందించి ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆవిష్కరణ రూపకర్తలు తమ ఆవిష్కరణలతో ఆగస్టు 5వ తేదీలోపుగా వాట్సాప్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిష్కరణలకు సంబంధించి ఆరు వ్యాఖ్యలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు చిత్రాలతోపాటు రూపకర్త పేరు, ఫోన్ నంబర్, ప్రస్తుత వృత్తి, పూర్తి చిరునామాను సెల్ నెం.9100678543కి వాట్సాప్లో పంపించాలి. ఎంపికైన వాటిని షార్ట్లిస్ట్ చేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయా జిల్లాల్లోనే ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. వీటిల్లో ప్రతి జిల్లా నుంచి ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదుతోపాటు ప్రశంసాపత్రాలను అందజేస్తారు.
శాస్త్రీయ నైపుణ్యం వెలికితీసే ‘ఇన్స్పైర్ మనక్’
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికితీసేందుకు ‘ఇన్స్పైర్ మనక్’ వేదికగా నిలుస్తున్నది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు శ్రీకారం చుట్టేలా ప్రోత్సహిస్తున్నది. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆమోదంతో నామినేషన్లను గైడ్ టీచర్ సహకారంతో www.inspireawards-dst.gov.in లో ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐడియాను ఆవిష్కరణ రూపంలోకి తెచ్చేందుకు ప్రతి ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున సంబంధిత విద్యార్థి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. జిల్లాస్థాయిలో 10 శాతం ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. ఒక్కో జాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20వేల నగదు పురస్కారం అందుతుంది. అంతేగాకుండా రాష్ట్రపతి భవన్లో ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన పరిశోధన కేంద్రాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు.
గతంలో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
2021-22 విద్యా సంవత్సరంలో ‘ఇన్స్పైర్ మనక్’ పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. జిల్లాలోని 1,257 పాఠశాలల నుంచి 897 నామినేషన్లు దాఖలుకాగా.. 115 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. అందులో 9 ప్రదర్శనలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ప్రదర్శనలను రూపొందించిన విద్యార్థులు ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
సత్తా చాటేందుకు చక్కని అవకాశం
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి ప్రయోగాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఇన్స్పైర్ మనక్ పోటీలను నిర్వహిస్తున్నది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ‘ఇంటింటా ఇన్నోవేషన్’ పోటీలను నిర్వహిస్తున్నది. ఈ పోటీల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనవచ్చు. ‘ఇన్స్పైర్ మనక్’ పోటీలకు మాత్రం పాఠశాల విద్యార్థులే అర్హులు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు చొరవ చూపాలి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జిల్లా ఖ్యాతిని చాటేందుకు ఇది చక్కని అవకాశం.