మొయినాబాద్, డిసెంబర్ 12 : హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడెప్పుడా అని స్థానికులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేతలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చేవెళ్ల రెవెన్యూ డివిజన్లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 331 ఎకరాల భూమి అవసరమని గుర్తించి భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. 331 ఎకరాల భూమి, నిర్మాణాలకు సంబంధించి రూ.164 కోట్ల పరిహారం చెల్లించడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు.
జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 కంటే ముందే నిర్మించిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లించబడుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. దాని ప్రకారమే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి, నిర్మాణాలు కోల్పోతున్న బాధితులకు పరిహారం చెల్లింపులు మొదలు పెట్టింది. ఇప్పటికే 212 ఎకరాల భూమికి, నిర్మాణాలకు సంబంధించి రూ.102 కోట్ల పరిహారం సంబంధిత బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
ఇప్పటి వరకు పరిహారం అందించిన భూములలో పనులు చేయడంతో పాటు పరిహారం అందిన నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. సోమవారం హిమాయత్నగర్ రెవెన్యూలో కొన్ని నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని వ్యాపార డబ్బాలను తొలగించారు. చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, తహసీల్దార్ అశోక్కుమార్ల ఆధ్వర్యంలో నిర్మాణాలను కూల్చివేశారు. భూములు, భవనాలు కోల్పోతున్న వారికి గడువు ఇచ్చామని, ఆ గడువు లోగా స్పందించకపోతే రోడ్డు పనులు మొదలు పెట్టడం ఖాయమని తెలిపారు.