ఇబ్రహీంపట్నంరూరల్, మే 4 : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం అనుబంధ గ్రామమైన హఫీజ్పూర్ గ్రామంలోని రైతుల భూ సమస్యకు త్వరలో భూ పరిష్కారం చూపుతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం హఫీజ్పూర్ గ్రామం పరిధిలో ఉన్న భూముల రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హఫీజ్పూర్ రెవెన్యూ పరిధిలోని 233 ఎకరాలను ఆన్లైన్లో చేర్చాలని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెల్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..1953నుంచి హఫీజ్పూర్ గ్రామం పరిధిలోని 1నుంచి 48వరకుగల సర్వే నెంబర్లలో గల 236 ఎకరాల భూమిని కాస్తు చేసుకుని బ్రతుకుతున్నామని, కానీ ఈ భూమి అటవీ శాఖ పరిధిలో లేనప్పటికి ఆన్లైన్లో చేర్చటం లేదన్నారు.
దీంతో తాము రైతుబంధు సహాయాన్ని కూడా పొందలేకపోతున్నామని అన్నారు. వెంటనే ఈ భూములను ఆన్లైన్లో చేర్పించే విధంగా కృషిచేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ రవణమోని మల్లీశ్వరి పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.