వికారాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతోపాటు నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తికావడంతో పనులు షురూ చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు శనివారంతో నాలుగు లేన్ల రహదారి ఎంతమేర విస్తరించనుందనే గుర్తులు వేసే పనుల ప్రక్రియను రహదారి నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణకు సంబంధించి గుర్తులను వేశారు.
మూడు విడుతల్లో నష్టపరిహారం
బీజాపూర్ రహదారి నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి ఎవరి నుంచి అయితే భూములను సేకరించారో వారందరికీ మూడు విడుతల్లో నష్టపరిహారం అందించనున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి విడుత కింద డబ్బులను అందజేసే ప్రక్రియ పూర్తయింది. బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా రహదారిని నిర్మించనున్నారు. గత మూడేండ్లుగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారంతపు సెలవుల్లో అయితే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరుగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
బైపాస్ రహదారులు, టోల్ ప్లాజా ఏర్పాటు
అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రహదారి ప్రస్తుతం కొన్ని చోట్ల 25 మీటర్లు, మరికొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారి విస్తరించి నాలుగు లేన్లుగా మార్చనున్నారు. ఇప్పటికే మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. చేవెళ్ల, మొయినాబాద్ల మీదుగా కాకుండా సమీప గ్రామాల నుంచి బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్న దృష్ట్యా టోల్ప్లాజాను కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి రూ.928.41 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ.. అనంతరం అంచనాల మేరకు మరో రూ.128 కోట్లకు పెంచారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకు 350 ఎకరాల మేర భూములను సేకరించారు. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ వే తరహాలో బీజాపూర్ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది.