Papaya Cultivation | యాచారం, డిసెంబర్ 14 : మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి పంటపైన దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు ఈ పంట సాగు చేయడం ఇందుకు కారణం. మండలంలోని చౌదరిపల్లి, గడ్డమల్లయ్యగూడ తదితర గ్రామాల్లో రైతులు బొప్పాయి పంటను సాగుచేస్తున్నారు.
ఈ ప్రాంతం పండ్లతోటలకు అనువైనది కావడంతో అదేవిధంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని రైతులు కూరగాయల సాగుతోపాటు బొప్పాయి తోటపైదృష్టి పెట్టారు. బొప్పాయి తోట డ్రిప్ పద్ధతిలో సాగుచేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ సాగు మంచి ఫలితాలు ఇస్తుండటంతో పలువురు రైతులు బొప్పాయి సాగుపై దృష్టి పెట్టారు
. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో డ్రిప్తో బొప్పాయి పంటను సాగుచేస్తే ఫలితాలు అధికంగా వస్తాయని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు దీంతో గ్రామానికి చెందిన రైతు కాశమల్ల రాములు 3 ఎకరాల్లో బొప్పాయి సాగును చేపట్టారు. తేవాన్రెడ్లేడ్ విత్తనాలను నలభై రోజుల పాటు నాటి మొలకలు వచ్చే వరకు రైతులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. బొప్పాయి పంట ఆరు నెలల నుంచే దిగుబడి వస్తుందని అధిక ఆదాయం ఉండటంతో బొప్పాయి పంట సాగుతో ఆర్థిక లాభాలు పొందవచ్చు. ఉద్యానవనశాఖ అధికారిణి కనకలక్ష్మి అందించిన సలహాలు, సూచనలు..
బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు అనుకూలం. ఈ నేలలను బాగా దున్నుకొని డ్రిప్ పైపులను అమర్చుకోవాలి. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ ఇవ్వగా, బీసీలకు 90శాతం సబ్సిడీలతో డ్రిప్ను అందజేస్తుంది. ప్రతి ఆరు అడుగులకు ఒక అడుగు లోతు గుంత తొవ్వాలి. అందులో ముందుగా ఆవు ఎరువును వేసి వారం పదిరోజులు మగ్గనివ్వాలి. తరువాత అందులో మొక్కలు నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు అందించాలి. నాలుగురోజులకోసారి నీటితో మొక్కలను తడిపితే సరిపోతుంది. పిందె దశలో ఒకరోజు తప్పి ఒకరోజు నీరందిస్తే ఆరు నెలల్లో బొప్పాయి పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. సంవత్సరం పాటు బొప్పాయి పంట కోతకు వస్తుంది. ప్రతి చెట్టుకు బొప్పాయి పదిరోజులకు ఒక్కసారి రైతు తెంపి మార్కెట్కు తరలిస్తారు. మార్కెట్లో పెద్దసైజులో ఉన్నబొప్పాయికి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.
మంచాలలో థైవాన్హైబ్రీడ్ రకాల బొప్పాయి పంటలను సాగుచేస్తున్నారు. బొప్పాయి సాగులో రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. భూమిని ముప్పైనుంచి నలభైమీటర్ల లోతుకు దున్నాలి. మొక్కకు మొక్కకు మధ్యన 1.8మీటర్ల దూరం వుండేటట్లు గుంతలు తీయాలి. మొక్కనాటే పదిహేను రోజుల ముందు 5కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి, ఇరవైగ్రాముల అజోస్పీరిల్లం, రెండువందల గ్రాముల ఫోన్సోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. తేలికపాటి నేలలో బొప్పాయిలో జింక్, బోరాన్దాతువు లోపం ఎక్కువ కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్, రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
మొక్క మొదలు దగ్గర నీరు తగలకుండా, నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు తయారుచేసి నీరును పారించాలి. మొక్కచుట్టూ నీరు నిల్వ ఉంటే కుల్లిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. అందుకే మొక్కచుట్టూ నీరు నిల్వ ఉండకుండా రైతులు చూసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ నెలలో ఆకులపై గోధుమ వర్ణపు మొక్కలు ఏర్పడి ఆకులు పసుపు రంగుగా మారి రాలిపోతాయి. దీనికి గాను లీటరు నీటికి మాంకో జెబ్ 2.5గ్రామలు పదిహేను రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పంటపై పిచికారీ చేయాలి. బొప్పాయిలో పదిహేను రోజులకోసారి మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. చెట్లు పూతకు వచ్చే వరకు క్రిమికీటకాల భారీనుంచి కాపాడేందుకు ఫాంటాక్, టాటామిడా, ఎఫ్4, బోరాన్ మందులను పిచికారీ చేయాలి. పంట కాపుకు వచ్చిన తరువాత తోటకు పిండినల్లి, రాకుండా మందులను పిచికారీ చేసుకోవాలి.
ఎకరా నేలను సాగు చేస్తే రెండువేలు ఖర్చవుతుంది. పేడ, ఎరువు పది లోడ్లకు ఇరవై వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఎకరాకు పదమూడు వేల మొక్కలు అవసరవుతాయి. ఒక్కొక్క మొక్కకు పదిరూపాయల చొప్పున పదమూడువేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి పద మూడువేలు, రెండు నెలలకు ఒకసారి ఎరువులకు ఇరవైవేల రూపాయలు ఖర్చు అవుతుంది. కలుపుతీతకు పదివేలు, మందుకు పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అదేవిధంగా డ్రిప్తో కలిపి మొత్తం దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు.
మొక్కలు నాటిన ఆరు నెలల నుంచే బొప్పాయి పండ్ల దిగుబడి ప్రారంభం అవుతుంది. ప్రతి పదిరోజులకోసారి బొప్పాయి పండ్లను తీసి మార్కెట్కు తరలిస్తారు. బొప్పాయి సాగుపై రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాదికి ముప్పై టన్నుల వరకు దిగుబడి వస్తుంది. నగరంలోని కొత్తపేట పండ్ల మార్కెట్లో ఒక కిలో బొప్పాయి ధరకు ఇరవైనుంచి ముప్పై రూపాయల వరకు ధర వస్తుందని సంవత్సర కాలం మొత్తం బొప్పాయి పంట రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. రైతుకు ఒక ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చుచేస్తే లాభాలు మాత్రం మూడింతలుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు బొప్పాయి పంట సాగుచేయడంతో లాభాలను తెచ్చి పెట్టింది. నేను ఐదు సంవత్సరాల నుంచి బొప్పాయి పంటసాగును చేపట్టాను. బొప్పాయి సాగు మధ్యలో కూరగాయల తోటలను కూడా సాగుచేయడంతో రెండు విధాలా లాభాలు వస్తున్నాయి.
– కాశమల్ల రాములు, రైతు చౌదర్పల్లి