ఏకాదశి, బక్రీద్ వేడుకలతో గురువారం ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. భక్తులతో ఇటు ఆలయాలు, అటు మసీదులు కిక్కిరిశాయి. హిందువులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకోగా.. ముస్లిం సొదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. దీంతో ఎక్కడా చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడింది.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
హిందువుల తొలి పండుగ ఏకాదశిని గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక గీతా పారాయణం చేశారు. అభిషేకం, విశేష అలంకరణ, తులసి అర్చన, విష్ణు సహస్ర పారాయణం చేశారు. అర్చకులు ఏకాదశి విశష్టతను భక్తులకు వివరించారు. ప్రముఖ చిల్కూరు బాలాజీ దేవాలయం, వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. – నమస్తే తెలంగాణ నెట్వర్క్