మంచాల, డిసెంబర్ 17 : విదేశాల్లో సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్కు మన మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ మంచి ఔషధ గుణం గల పండు కావడంతో మార్కెట్లో కిలోకు 2 వందల వరకు ఉండడంతో విదేశాలలో పండే డ్రాగన్ ఫ్రూట్ మన తెలంగాణలో కూడా సాగు చేస్తున్నారు. తాను కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట పండించాలనే పట్టుదలతో ఉన్న వనంపల్లి శ్రీనివాస్రెడ్డి నగరంలోని బీకాం, ఎల్ఎల్బీ చదువుకుంటూనే క్రీడాకారుడిగా రాణించాడు.
క్రీడా కోటలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో ఉద్యోగం పొందాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాని లక్ష్యంతో 2000 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పంటసాగుపై అధ్యయనం చేశాడు. శాస్త్రవేత్తల సహకారంతో దేశ విదేశాలలో పర్యటించి డ్రాగన్ ఫ్రూట్ సాగుపై అక్కడి రైతులను అడిగి తెలుసుకొని మన నేలపై సిరులు కురిపించాలని లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగుచేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు.
మంచాల మండలం ఆరుట్లలో శ్రీనివాస్రెడ్డికి 12 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో కొద్ది పాటి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంజీర కంటే అధిక లాభాలు వచ్చే పంట సాగు చేయాలనే భావించాడు. ఆలోచనతోనే డ్రాగన్ ఫ్రూట్ పంట గురించి తెలుసుకున్నాడు. భూసార పరీక్షతో పాటు వాతావరణ పరీక్ష కూడా చేయించాడు. సమశీతోష్ణ్ణస్థితిలో డ్రాగన్ ఫ్రూట్ పంటకు అనువైందని తేలింది. దీంతో ఉమామహేశ్వర రావు అనే ఉత్తమ రైతు సలహాలతో మహరాష్ట్రలోని జీరంగాబాద్కు వెళ్లి డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించాడు. అక్కడి నుంచి డ్రాగన్ ఫ్రూట్ పంటకు సంబంధించిన పిలకలను తీసుకువచ్చాడు. దీంతో ముందుగా 3 ఎకరాల్లో రూ.5లక్షల ఖర్చుతో 435 మొలకలు నాటించాడు. మొత్తం 3 ఎకరాల్లో సాగు చేశాడు. అదేవిధంగా మరో 9ఎకరాల్లో కూడా డ్రాగన్ఫూట్ను సాగు చేశాడు.
తెలంగాణలో వ్యవసాయ పొలాలు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు అనువైన నేలలు 10/10 దూరంతో ఎకరాకు 435 మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం, మొక్కల వద్ద కడీలు నాటడం, తీగలు కట్టడం వంటి వాటికి ఎకరాకు రూ. 5లక్షల ఖర్చు వస్తుంది. పంటకు ఎలాంటి తెగుళ్లూ సోకవు, వాటికి కలుపు తీయడం, దున్నించడం, పర్యవేక్షణ నిమిత్తం ఏడాదికి మరో రూ.6వేల ఖర్చు ఉంటుంది. నిత్యం 4 నుంచి 5లీటర్ల నీరు అవసరం ఉంటుంది. నాటిన ఏడాదిన్నర కాలంలో పూత మొదలై కాత వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పంట వస్తుంది.
ఒక మొక్క జీవితకాలం 30 సంవత్సరాలు, మొదటి సంవత్సరం 10 నుంచి 25 కాయలు కాస్తుంది. రెండవ సంవత్సరం 30 నుంచి 40కాయలు.. ఇలా పెరుగుతూనే ఉంటాయి. ఒక కాయ 350 నుంచి 400 గ్రాములు బరువు ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాలు ఎకరాకు టన్ను చొప్పున మూడవ సంవత్సరం నుంచి ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది. వీటిని బెంగుళూర్, ముంబాయి, పూణెలో ఎక్కువగా విక్రయిస్తారు. కిలో రూ.200 వందల నుంచి 4వందల వరకు ధర పలుకుతుంది. మంచిగా పంట చేతికి వస్తే ఎకరాకు రూ.లక్షల ఆదాయం వస్తుందని శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
డ్రాగన్ ఫ్రూట్ ఎంతోపోషకాలు గల పండు మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఆరోగ్య పోషకాలు మొండుగా ఉన్నాయన్నారు. సౌందర్య సాధన ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. జ్యూస్తో పాటు వైన్ కూడా తయారుచేస్తారు. వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. వైద్యులు కూడా అధిక ప్రాధాన్యం డ్రాగన్ ఫ్రూట్కే ఇస్తారని శ్రీనివాస్రెడ్డి వివరించాడు.
రైతు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంటే అధికంగా సంపాదించాలి. ఆ దిశగా పంటలు సాగు చేయాలి. నూతన విధానాలు పాటించడమేగాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను పండించాలనే పట్టుదల ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్తో పాటు రామఫలం. పనస, పెద్ద ఉసిరి, దానిమ్మ, అల్లనేరేడు, స్ట్రాఫ్రూట్, సపోటా, చైనాజామ, తైవాన్ చింతపండు, నారింజ, నిమ్మ, దిప్పనిమ్మ, బొప్పాయి, మరో 8రకాల మామిడి పండ్ల మొక్కలు పెంచుతున్నారు. అదేవిధంగా మరో 9ఎకరాల్లో కూడా డ్రాగన్ఫ్రూట్ను సాగు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న.
– వనంపల్లి శ్రీనావాస్రెడ్డి, రైతు