మొయినాబాద్, డిసెంబర్ 26 : అదనపు కట్నం ఇవ్వాలని, తరచుగా భార్యపై అనుమానం పడుతూ మానసికంగా వేధిస్తున్న భర్త కానిస్టేబుల్పై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ డీకే లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా కాశినాయన మండల పరిధిలోని కోండ్రాస్పల్లి గ్రామానికి చెందిన సిద్దయ్య, నారాయణమ్మ దంపతుల రెండో కూతురు సునీతను హైదరాబాద్లోని అమీర్పేట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎల్లోజి, కృష్ణవేణి దంపతుల కుమారుడు సిద్దులుకు ఇచ్చి 10 నెలల క్రితం వివాహం చేశారు.
సిద్ధయ్యకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క సుబ్బమ్మ, బావ శివప్రసాద్ వద్ద సునీత మూడేండ్ల నుంచి మొయినాబాద్లో నివాసం ఉంటున్నది. తండ్రికి ఉన్న భూమిని ముగ్గురు పంచుకున్నారు. కాగా, సునీత పెండ్లి చేసే బాధ్యత బావ, అక్క తీసుకొని సునీత వాటాకు వచ్చిన భూమిని ఆమె అక్క సుబ్బమ్మ కొనుగోలు చేసి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి (బంగారం, సామగ్రి, కట్నం కలిపి) వివాహం చేసింది. అయితే సిద్దులు నార్సింగి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
వివాహం చేసుకున్న రెండు నెలల తరువాత సునీతను నీ వాటకు వచ్చిన భూమి, అదనపు కట్నం తేవాలని భర్త సిద్దులు, మామ ఎల్లోజి, అత్త కృష్ణవేణి, మరది శివ వేధిస్తున్నారు. అదే విధంగా అనుమానాలు పెట్టుకుని మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులు తాళలేక సునీత మొయినాబాద్లో నివాసం ఉంటున్న తన అక్క, బావల వద్దకు 4 నెలల క్రితం వచ్చింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని సునీత పోలీసులను ఆశ్రయించింది. సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.