మర్పల్లి, జనవరి 9 : మార్కెట్లో ఉల్లి ధర నిలకడగా.. ఆశాజనకంగా ఉండడంతోపాటు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరగడం, చెరువులతో పాటు బావుల్లో నీరు పుష్కలంగా రావడంతో కూరగాయల పంటలతో పాటు ఉల్లి సాగుపై రైతులు దృష్టి సారించారు. మండలంలోని బిల్కల్, దార్గులపల్లి, తుమ్మలపల్లి, నర్సాపూర్, గుండ్లమర్పల్లి, సిరిపురం, వీర్లపల్లి, కొత్లాపూర్, పట్లూర్, పంచలింగాల్, మొగిలిగుండ్ల, కొంషెట్పల్లి, మర్పల్లి, కోట్మర్పల్లి, కల్ఖోడా, బూచన్పల్లి, రావులపల్లి తదితర గ్రామాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు.
పంచలింగాల్లో 300 ఎకరాల్లో..
మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామం ఉల్లి పంట సాగుకు మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 8 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురువడంతో మండలంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు దాదాపు 800 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఒక్క పంచలింగాల్ గ్రామంలోనే సుమారు 300 ఎకరాలకు పైగా ఉల్లిసాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఉల్లి ధరలు ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్కు రూ.1800 నుంచి రూ.2400ల వరకు ధర పలుకుతున్నది. ఉల్లి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో రైతులు ఉల్లిసాగుపై ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంత మంది రైతులు 2నెలల ముందుగానే ఉల్లిపంట వేశారు. మరో నెలలో పంట చేతికొస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
పెట్టుబడులు అధికం..
ఎకరా భూమిలో ఉల్లి పంట సాగు చేసేందుకు రూ.60వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. భూమి చదునుకు రూ.10 వేలు, మడులు కట్టేందుకు 8 మంది కూలీలకు రూ.4వేలు, కూలీలకు ఉల్లి నాటు వేయడానికి రూ.17 వేలు, 2 డీఏపీ బస్తాలు రూ.2700, 2 యూరియా బస్తాలు రూ.580, పొటాష్ ఒక బస్తా, పూత మందులు, గడ్డి మందు పిచికారీ చేసేందుకు రూ.10వేలు. పంట కోత కోయడానికి ఒక మడికి రూ.25, 400 మడులకు రూ.10 వేల వ్యయం అవుతుందని తెలిపారు. ఉల్లినారు తన పొలంలోనే పెంచి నాటు వేస్తే ఇంత ఖర్చు అవుతుందని, ఇతరుల వద్ద కొనుగోలు చేస్తే ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఎకరాకి 70 క్వింటాళ్ల నుంచి 80 వరకు దిగుబడి వస్తుందని పంట చేతికొచ్చాక మార్కెట్లో క్వింటాల్కు 2వేల నుంచి రూ.2,500 ధర పలికితే ఖర్చులు పోను కొద్దిమేర లాభం వస్తుందని రైతులు అంటున్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
ఉల్లిపంట వేయడానికి భూమిని నేల వదులుగా అయ్యేలా చదును చేసుకోవాలి. చివరి దుక్కి గుంటుకతో దున్నిన తరువాత చిన్న, చిన్న మడులుగా తయారుచేసి నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేసుకోవాలి. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి ఉల్లి పంటకు మందులు, ఎరువులు తగిన మోతాదులో వాడాలి.
– మహేశ్, ఏఈవో, సిరిపురం క్లస్టర్
10 ఏండ్ల నుంచి సాగు చేస్తున్నా..
10 ఏండ్ల నుంచి ఉల్లి పంట సాగు చేస్తున్నాను. కనీసం గిట్టుబాటు ధర క్వింటాల్ మార్కెట్లో రూ.2 వేల నుంచి రూ.2500ల వరకు ఉంటే లాభం వస్తుంది. గిట్టుబాటు ధర లేక చాలా మంది లారీల చార్జీలు కూడా చెల్లించని పరిస్థితులు ఉంటాయి. ధరలు ఇలాగే ఉంటే కొంతైనా లాభం వస్తుంది.
– జగన్నాథం, రైతు, పంచలింగాల్
ధరలు బాగున్నాయని..
ఉల్లి ధరలు బాగున్నాయని మా గ్రామంతో ఇతర గ్రామాల రైతులు పంట సాగుపై మొగ్గుచూపుతున్నా రు. 25 ఏండ్ల నుంచి ఉల్లిపంట సాగు చేస్తున్నాను. ఈ ఏడాది మూడెకరాల్లో ఉల్లి పంట వేశాను.
– సంజీవ్ యాదవ్, రైతు, పంచలింగాల్