వికారాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్లో రైతులు అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు పంట సాగుకోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులను కొనేందుకు రైతుబంధు సాయాన్ని అందజేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా సాయం అందకపోవడం.. మరోవైపు అప్పులు దొరకక అన్నదాత తీవ్ర కష్టాలు పడుతున్నాడు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు ఇస్తామని హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గించి మోసం చేసింది.
30 నెలలు అవుతున్నా అర్హులైన రైతులందరికీ రైతుభరోసా అందించడంలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం రైతును రాజుగా చేసే ఆలోచనతో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతోపాటు రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓ వైపు పెట్టుబడి సాయం అందక.. బ్యాంకర్లు పంట రుణాలను మంజూ రు చేయకపోవడంతో అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
రైతులకు అరకొర రుణాలే..
2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు బ్యాంకర్లు అరకొర రుణాలనే మంజూరు చేశారు. ఓ వైపు పంట రుణాల మంజూరులో నిర్లక్ష్యంతో గతేడాది నిర్దేశించిన లక్ష్యంలో 56 శాతం మేర మాత్రమే మంజూరు చేశారు. ఈ ఏడాది వానకాలం, యాసంగిలకు రూ.3,882 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని..రూ.2,176 కోట్ల రుణాలనే బ్యాంకర్లు రైతులకు మంజూరు చేశారు. వానకాలం, యాసంగి సీజన్ల్లో నిర్దేశించిన లక్ష్యంలో సగం మేర రుణాలను మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. అర్హుల్లో కొంతమందికే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభు త్వం నష్టం చేస్తే, మాఫీ అయిన రైతుల పంట రుణాల ను రెన్యువల్ చేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యాసంగి దాటే వరకూ రైతులకు పంట రుణాలను మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసిన రైతులు అప్పుల ఉబ్బిలో కూరుకుపోతున్నారు.
కొందరికే రైతుభరోసా..
కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పెండింగ్తోపాటు వానకా లం సీజన్ రైతుభరోసా సాయాన్ని అందించకపోవడంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. జిల్లాలో 3,27,561 మంది రైతులను అర్హులుగా గుర్తించి వారికి రూ.387.09 కోట్ల రైతు భరో సా సాయాన్ని అందజేయాలని నిర్ణయించగా, యాసంగి లో రెండెకరాల్లోపు గల 2,82,509 మంది రైతులకు రూ.231 కోట్ల రైతుభరోసా సాయాన్ని మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగతా 45,052 మంది రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడు జమ అవుతుందనేది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. గత వానకాలం లో నాలుగెకరాల్లోపు రైతులకు రైతుభరోసాను అందజేసి మిగతా రైతులకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం … యాసంగిలో రెండెకరాలకే పెట్టుబడి సాయాన్ని అం దించి అన్నదాతను నిండా ముంచింది. అయితే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో జిల్లా రైతాంగం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.