సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లకు మంగళవారం కొత్త బాస్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్గా జీ సుధీర్బాబులను నియమించింది. విధి నిర్వహణలో సిన్సియర్ అధికారులుగా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీ(అడ్మిన్)గా పని చేస్తున్న అవినాష్ మహంతికి చట్టానికి లోబడి, ముక్కుసూటిగా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తారన్న పేరున్నది. ప్రభుత్వ భూముల కబ్జాలు, మట్టి కుంభకోణం, చీటింగ్, సైబర్ కేసులు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ అమాయక ప్రజలను పట్టి పీడించిన కలర్ ప్రిడిక్షన్, లోన్ యాప్ వంటి కేసులను ఛేదించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం సైబరాబాద్ సీపీగా నియమించింది. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా కొనసాగుతున్న జి.సుధీర్బాబుకు హైదరాబాద్తో పాటు రాచకొండ కమిషనరేట్పై గట్టి పట్టున్నది. మహబూబ్నగర్ ఎస్పీగా, టాస్క్ఫోర్స్, అల్వాల్, శంషాబాద్ డీసీపీగా, వరంగల్ సీపీగా పని చేశారు. రాచకొండ జాయింట్ సీపీగా పని చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. రాచకొండలో జాయింట్ సీపీగా పని చేసిన అనుభవం ఉండడంతో ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమించింది. సిబ్బందికి దిశా నిర్దేశం చేసి, ప్రజలకు పారదర్శక సేవలు అందించేలా చేయడంతో పాటు చట్టాన్ని అతిక్రమించే వారికి సింహ స్వప్నంలా ఉంటారని కొత్త బాస్లకు పేరున్నది.
హైదరాబాద్ మహానగర ట్రై పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ బాస్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ జాయింట్ సీపీ(అడ్మిన్)గా కొనసాగుతున్న ఐజీ 2005 బ్యాచ్కు చెందిన అవినాష్ మహంతిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, 2001(ఎపీఎస్) బ్యాచ్కు చెందిన జి.సుధీర్బాబును రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమించారు. హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సందీప్ శాండిల్యాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్గా నియమించగా, రాచకొండ, సైబరాబాద్ సీపీలుగా కొనసాగిన డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి దిశానిర్దేశం చేసి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేలా చేయడంతో పాటు చట్టాన్ని అతిక్రమించే వారికి సింహ స్వప్నంలా ఉంటారని ట్రై కమిషనరేట్ కొత్త కమిషనర్లకు పేరుంది.
2005వ బ్యాచ్కు చెందిన అవినాష్ మహంతి ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీ(అడ్మిన్)గా కొనసాగుతున్నారు, అక్కడ పనిచేస్తుండగానే ఈ ఏడాది మే నెలలో ఐజీగా పదోన్నతి పొంది అదనపు సీపీ(అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్నారు. అవినాష్ మహంతి కుటుంబంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు. ఇందులో తండ్రి ఏకే మహంతి రిటైర్డు డీజీపీ కాగా సోదరుడు అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఎన్నికల వచ్చాయంటే ఈ కుటుంబంలోని ఐపీఎస్ అధికారులు అందరికి గుర్తుకు రావాల్సిందే. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది, ఆయన స్థానంలో 1975 బ్యాచ్కు చెందిన ఏకే మహంతిని నియమించింది. 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొడంగల్లో కాంగ్రెస్ తరుఫు నుంచి పోటీ చేసిన ప్రస్తుత(సీఎం) రేవంత్రెడ్డి ఇంటిపై పోలీసులు చేసిన దాడి వివాదాస్పదమైంది, దీనిని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆ స్థానంలో హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అవినాష్ మహంతిని నియమించింది. 2023 ఎన్నికలలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను బదిలీ చేస్తూ ఆ స్థానంలో 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అభిషేక్ మహంతిని నియమించింది.
మొదటి పోస్టింగ్ ఛత్తిస్ఘడ్లో చేసి తరువాత ఏపీ క్యాడర్కు వచ్చారు, మెదక్ ఎస్పీగా, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ, హైదరాబాద్ కమిషనరేట్లో డిటెక్టివ్ డిపార్టుమెంట్ (సీసీఎస్) డీసీపీగా పనిచేస్తూ ఎన్నికల సంఘం నియామకంతో తాత్కాలికంగా వికారాబాద్ వెళ్లారు, తిరిగి సీసీఎస్ డీసీపీగా కొనసాగుతూ డీఐజీగా పదోన్నతి పొందారు, అక్కడి నుంచి సైబరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు, అక్కడే ఐజీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు.
చట్టానికి లోబడి పనిచేయాలని, ముక్కుసూటిగా పనిచేస్తూ ప్రజలకు పోలీసు సేవలు అందించాలని సిబ్బందికి సూచనలు చేస్తూ తాను వారితో పాటు పనిచేస్తుంటారు. గీత దాటితే చర్యలుంటాయని సిబ్బందిలో క్రమశిక్షణ తీసుకొస్తారు. హైదరాబాద్ సీసీఎస్లో పనిచేస్తూ తనకంటూ ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం కాకుండా ప్రభుత్వానికి చెందేలా ఆయా కేసులను దర్యాప్తు జరిపి పక్కా సాక్ష్యాలను సేకరించి, న్యాయస్థానాల్లో ఆ భూములు ప్రభుత్వం పరం అయ్యే విధంగా తన వంతు పాత్ర పోషించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ అమాయక ప్రజలను పట్టి పీడిచిన కలర్ ప్రిడిక్షన్, లోన్ యాప్ కేసులను ఛేదించి విదేశీయులను సైతం అరెస్ట్ చేశారు. మొదటి సారిగా హైదరాబాద్ పోలీసులు వేలకోట్ల స్కామ్లోన్ యాప్లలో జరుగుతూ విదేశాలకు భారతీయుల సొమ్ము వెళ్తుందని గుర్తించి కేంద్రానికి చెప్పారు. జీహెచ్ఎంసీలో జరిగిన మట్టి కుంభకోణంలో అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. చీటింగ్, సైబర్ కేసుల దర్యాప్తులో పెండింగ్ కేసులు ఉండకుండా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో తనదైన శైలిలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం సైబరాబాద్ సీపీగా నియమించింది.
కమిషనరేట్పై పట్టు
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా కొనసాగుతున్న జి.సుధీర్బాబుకు హైదరాబాద్తో పాటు రాచకొండ కమిషనరేట్పై గట్టి పట్టుంది. మహబూబ్నగర్ ఎస్పీగా, టాస్క్ఫోర్స్, అల్వాల్, శంషాబాద్ డీసీపీగా, వరంగల్ సీపీగా పనిచేశారు. అనంతరం రాచకొండ జాయింట్ సీపీగా పనిచేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ పనిచేసినా అక్కడ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. సిబ్బందిని ఖచ్చితంగా విధులు నిర్వహించడం, ప్రజలకు పారదర్శక సేవలు అందించేలా సిబ్బందికి దిశానిర్ధేశం చేస్తూ సేవలు అందిస్తారు. రాచకొండలో జాయింట్ సీపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో కమిషనరేట్పై మంచి పట్టుంది. దీంతో ప్రభుత్వం ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమించింది.