షాద్నగర్రూరల్, మార్చి 17 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తోందనే ఉద్దేశంతో విద్యా రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గత ఉమ్మడి పాలనలో పాలకులు విద్యా వ్యవస్థపై శ్రద్ద తీసుకోకపోవడంతో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు వచ్చాయి. విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతున్నది. 100శాతం అక్షరాస్యతను సాధించేందుకు సర్కార్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు, మధ్యాహ్న భోజన పథకానికి చర్యలు తీసుకున్నది.
అదేవిధంగా పాఠశాలలో అన్ని మౌలిక వసతులను సమకూర్చేలా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి పరిచేందుకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. ఇప్పటికే చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. దీంతో నేడు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆధునిక సౌకర్యాలతో పాఠశాల
ఫరూఖ్నగర్ మండలలలోని చౌడమ్మగుట్ట తండా ప్రాథమిక పాఠశాల గతంలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ సర్కార్ వచ్చాకే ఈ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఇదే తరుణంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మండలంలోని చౌడమ్మగుట్టతండా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని దత్తత తీసుకున్నది. నాటి నుంచి ఈ తండా పాఠశాల, అంగన్వాడీ కేంద్రం రూపురేఖలు మారిపోయాయి. ఆధునిక భవనం, విశాల తరగతి గదులు అన్ని మౌలిక వసతుల రూపకల్పనతో ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం మండలంలో ఆధునిక హంగులతో ఈ పాఠశాల గుర్తింపు పొందింది.
పాఠశాలకు రూ.కొటీ 20లక్షలు వెచ్చింపు
మండలంలోని చౌడమ్మగుట్ట ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దత్తత తీసుకొని ఈ పాఠశాల రూపురేఖలు మార్చింది. ఈ పాఠశాల భవనంతో పాటు విద్యార్థులకు సకల సౌకర్యాలతో 6 తరగతి గదులు, వాష్రూంలు, వంటగది, డైనింగ్ హల్, ప్రహరీ ఇలా అన్ని వసతులను సమకూర్చింది. ఇందుకుగాను రూ.కోటీ 20లక్షలను వెచ్చించింది. ఆధునిక హంగులతో ఈ పాఠశాల ఎంతో సుందరంగా మారడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.
పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు..
మా పాఠశాల చాలా సుందరంగా మారింది. నూతన భవనం, విశాల తరగతి గదులు, బాత్రూంలు, డైనింగ్హాల్ ఇలా అన్ని వసతులను సమకూర్చారు. ఉపాధ్యాయులు మంచిగా విద్యను బోధిస్తున్నారు. నేను మంచిగా చదువుకుంటాను.
-మానస, విద్యార్థి, చౌడమ్మగుట్టతండా ప్రాథమిక పాఠశాల
అన్ని వసతులను సమకూర్చారు..
మా పాఠశాలలో అన్ని వసతులను సమకూర్చారు. ప్రైవేటుకు దీటుగా మా పాఠశాలను తీర్చిదిద్దారు. మా తండాలోని విద్యార్థులు ఇక్కడికే వస్తున్నారు. నేను రోజూ పాఠశాలకు వస్తా. ఉపాధ్యాయులు మాకు మంచిగా పాఠాలు చెబుతున్నారు. మా పాఠశాలను చూస్తుంటే సంతోషంగా ఉంది.
-అఖిల, విద్యార్థి, చౌడమ్మగుట్టతండా
రూ.కోటీ 20 లక్షలతో నిర్మాణం..
మా పాఠశాలలో ఆధునికంగా నిర్మాణ పనుల చేపట్టారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దత్తత తీసుకొని రూ.కోటీ 20లక్షలతో పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చదివేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
-సుమతమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, చౌడమ్మగుట్ట ప్రాథమిక పాఠశాల