మోమిన్పేట, మార్చి 19 : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్య పడకుండా బేఫికర్గా ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అన్నారు. ఇటీవల మండలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షానికి రైతులు సాగు చేసిన ఉల్లి, కూరగాయ, బొప్పాయి, అరటి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతినడంతో ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి సయ్యద్ అలీపూర్, కేసారం, ఇజ్రాచిట్టెంపల్లి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పగలనకా.. రేయనకా కష్టపడి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యంతో దెబ్బ తినడం చాలా బాధాకరమన్నారు. దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని రైతులకు సూచించారు.
మండల వ్యవసాయాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి ఏ యే పంట ఎంత మేర దెబ్బతిన్నాయో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారని తెలిపారు. నష్టపోయిన పంటల అంచనా విలువ ప్రకారం ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. జిల్లా, మండల వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. వడగండ్లతో దెబ్బతిన్న ఇండ్ల యజమానులు, గాయపడిన లక్ష్మిని పరామర్శించారు. దెబ్బతిన్న ఇండ్ల వివరాలను కూడా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి వివరాలను ప్రభుత్వానికి పంపిస్తారని తెలిపారు. వారికి కూడా పరిహారం అందుతుందని తెలిపారు. అకాల వర్షాలు తగ్గే వరకు ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మోమిన్పేట, మర్పల్లి మండలాల అధ్యక్షులు వెంకట్, శ్రీకాంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరిశంకర్, స్థానిక సర్పంచులు సత్యనారాయణ రెడ్డి, కాశీరాం, చంద్రకళ, నాయకులు, జిల్లా, మండల వ్యవసాయాధికారులు పాల్గ్గొన్నారు.