వికారాబాద్, అక్టోబర్ 25 : తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ప్రజాఆశీర్వాద సభలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని కొత్తగడిలో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే ఆనంద్కు మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా అధికారులను తీసుకొచ్చి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశానన్నారు.
రాష్ట్రంలో 93లక్షల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు రూ.5లక్షల బీమా పథకం ద్వారా దీమాగా ఉందన్నారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. రైతు బంధు ఎకరాకు రాబోయే రోజుల్లో రూ.16వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో పుట్టిన మరో వ్యక్తి మనల్ని పాలించేందుకు వస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని, తరిమి కొట్టాలన్నారు. స్థానికుడైన నన్ను గుర్తించి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. డిగ్రీ, మెడికల్ కళాశాల, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కౌన్సిలర్ పుష్పలతారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, గోపాల్, కృష్ణారెడ్డి, కిరణ్పటేల్, నాయకులు రాజమల్లు, విజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, కమాల్రెడ్డి ఉన్నారు.