కంటోన్మెంట్, జూన్ 9: రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల మైదానం వేదికగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళా శుక్రవారం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మర్రి రాజశేఖర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై యువతనుద్దేశించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తేనే వారి కుటుంబానికి ఆధారం కల్పించినట్లు ఉంటుందన్నారు. యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాల భర్తీ జరగగా, మరో 90 వేల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేసిందన్నారు. అనంతరం క్రిశాంక్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగానే జాబ్మేళాను ఏర్పాటు చేశామని తెలిపారు.
మెగా జాబ్మేళాకు సుమారు 102 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 2 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ కంపెనీలైన విప్రో, హెచ్సీఎల్, క్లస్టర్, ఐటీ, హెటిరో, ధునూష్ ఇంజినీరింగ్ సర్వీసెస్ లాంటి కంపెనీలతోపాటు బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. నెలకు కనీసం రూ.15వేల నుంచి రూ.45వేల జీతంతో సుమారు 419 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మర్రి రాజశేఖర్రెడ్డితోపాటు కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్నాయక్, నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి, రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్లు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, ప్రభాకర్, శ్యామ్కుమార్, బీఆర్ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, ప్రభుగుప్తా, పెద్దాల నర్సింహ, శ్రీకాంత్, ప్రవీణ్యాదవ్, రాజుసింగ్, సురేశ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.