కొత్తూరు, జనవరి 18: హైవే డీజిల్ దొంగలను కొత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్దనుంచి డీసీఎం వాహనం, రూ. 45 వేలు , 13 ఖాళీ డ్రమ్ములు, ఓ గొడ్డలిని స్వాధీనం చేసుకొని నలుగురిని రిమాండ్కు తరలించారు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న గుజరాత్ నుంచి చెన్నై వెళ్తున్న రెండు లారీలు కొత్తూరు బస్టాండ్ సమీపంలోని నేషనల్ హైవే 44పై ఆపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో వారి లారీల నుంచి మధ్యప్రదేశ్కు చెందిన నషీబ్షా(42), ముబారిక్ షా(38), బీరమ్సింగ్ వర్మ(38)లు డీసీఎం వాహనంలో వచ్చి పదునైన గొడ్డలితో ట్యాంక్ తాళం పగులగొట్టి 400 లీటర్ల డీజిల్ దొంగలించారు. లారీ డ్రైవర్ మోసీన్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
కొత్తూరు సీఐ బాలరాజు నేతృత్యంలో కొత్తూరు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి కేసు ఛేదించారు. ఈ నెల 17న రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు విజయలక్ష్మి బస్టాప్ వద్ద కాపు కాశారు. అక్కడకు డీసీఎంలో వచ్చిన లారీ నుంచి డీజిల్ తీసేందుకు యత్నించిన నషీబ్షా, ముబారిక్ షా, బీరమ్ సింగ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 45 వేలు, డీసీఎం వాహనం, ఓ గొడ్డలి, 4 మీటర్ల పైప్ను స్వాధీనం చేసున్నారు. వీరిని విచారించిన పోలీసులు వారి వద్ద నుంచి డీజిల్ కొంటున్న శంషాబాద్కు చెందిన ఎండీ అన్వర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎండీ అన్వర్ వీరితో పాటు దొంగతనాలకు పాల్పడుతూ రూ. 50 లీటర్ చొప్పున డీజిల్ కొనేవాడని పోలీసుల విచారణలో తేలింది. హయత్నగర్, అడ్డాకుల, చేగుంట, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో డీజిల్ దొంగిలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లారని ఏసీపీ తెలిపారు. అత్యంత చాకచక్యంగా పట్టకున్న సీఐ బాలరాజును ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా, కానిస్టేబుళ్లు నరేందర్, కుమార్, లింగస్వామి, మణిపాల్ హరీశ్, రవీందర్నాయక్ను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.