వికారాబాద్, డిసెంబర్ 15 : నూతన సంవత్సరానికి నూతన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో వార్షిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. అధికారులందరూ పెండింగ్లో ఉన్న ఫైల్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరపు లక్ష్యాలు, సీసీ టీవీల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు , ఆత్మహత్యలు, యూఐలను తగ్గించడం, ఎన్ఫోర్మెంట్ పెంచడంపై విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
వచ్చే సంవత్సరం కూడా ఈ విధంగానే నిరంతరం శ్రమించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుటలో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూద్దామని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రశీద్, పరిగి, వికారాబాద్, తాండూరు డీఎస్పీలు, జిల్లా సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు పాల్గొన్నారు.