మంచాల, జనవరి 9 : ప్రభుత్వం స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటిని గ్రామాలకు నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ అధికారుల చిన్నచిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతోనే నెలలో 20 రోజులు కూడా తాగునీటి సరఫరా కావడంలేదని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంచాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ జాటోతు నర్మద అధ్యక్షతన నిర్వహించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, నాగరాజు, జగన్రెడ్డి, రమాకాంత్రెడ్డి, పాండు సభా దృష్టికి తీసుకురాగా.. స్పందించిన అధికారులు సమస్య తలెత్తకుండా చూడనున్నట్లు చెప్పారు. చౌర ధరల దుకాణాల్లో రేషన్ బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను అమ్మేలా చూడాలని ఎంపీటీసీలు శేఖర్రెడ్డి, శ్రీనివాస్, రమేశ్ కోరగా.. తహసీల్దార్ అనిత ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
సహకార సంఘం నుంచి ఎరువులు, యూరియాల కోసం డీడీలు కట్టినప్పటికీ ఇంతవరకు రాలేదని సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి తెలుపగా.. స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకవెళ్లనున్నట్లు చెప్పారు. సమావేశంలో విద్య, విద్యుత్, రవాణా, అటవీశాఖ, ఉపాధి హమీ, ఇరిగేషన్ తదితర శాఖల అంశాలపై ప్రజా ప్రతినిధులు చర్చించారు.
అనంతరం ఎంపీపీ నర్మద మాట్లాడుతూ.. మండలంలో నూతనంగా ఏర్పడిన 5 గ్రామపంచాయతీలకు పక్క భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక్కో గ్రామపంచాయతీకి 20లక్షల రూపాయల చొప్పున కేటాయించిందని చెప్పారు. మండలంలోని ఆగపల్లి నుంచి మంచాల వరకు తిప్పాయిగూడ-మంచాల, ఆరుట్ల నుంచి చెన్నారెడ్డి గూడ వరకు రోడ్ల ఏర్పాటు కోసం సుమారు 5కోట్ల వరకు కేటాయించిందని వెంటనే పనులను ప్రాంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్వరి, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, సీడీపీవో శాంతిశ్రీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.