వికారాబాద్, ఏప్రిల్ 8 : ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించాలన్నారు. ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి మే 2 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి వికారాబాద్లో 2, తాండూరులో 2 పరీక్షా కేంద్రాల్లో 691 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలకు వికారాబాద్ 3, తాండూరులో 2 పరీక్షా కేంద్రాల్లో 1095 మంది పరీక్షలకు హాజరు హాజరు కానున్నట్లు తెలిపారు. కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బందిని నియమించాలని వైద్యాధికారికి సూచించారు.
వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షా సమయాలను బట్టి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను నడిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమీక్షా సమావేశంలో డీఈవో రేణుకాదేవి, డీఎంహెచ్వో పల్వన్ కుమార్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ రామ్రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణ, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రమేశ్, పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులున్నారు.