ఆమనగల్లు, డిసెంబర్7: కొలువుల జాతరకు కసరత్తు ముమ్మరమైనది. రాష్ట్రంలో శాఖలవా రీగా ఉన్న ఖాళీలను సేకరించి త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శాఖల వారీగా ఉన్న ఖాళీల సేకరణలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యా రు. ఇప్పటికే జోన్లు, మల్టీజోన్ల విభజన కూడా పూర్తి అయ్యింది. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో ఏ విధమైన చిక్కులు ఉండవని భావిస్తున్న ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే శాఖలవారీగా సీనియారిటీ ప్రకారం పెద్ద ఎత్తున ప్రమోషన్లను ప్రకటించింది. ఉపాధ్యాయులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్యశాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు జారీచేసేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇప్పటికే డీఈ వో ఆయా మండలాల్లోని ఎంఈవోల నుంచి పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను సేకరించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల, వైద్య, పోలీసు శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కోచింగ్ సెంటర్ల బాటలో నిరుద్యోగులు..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వివి ధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నద ని తెలియడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఉపాధ్యాయ కోర్సులు పూర్తిచేసిన నిరుద్యోగులు (బీఈడీ, డీఈడీ) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారంతా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బాట పడుతున్నారు. హైదరాబాద్ వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేని వారంతా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే స్టడీసెంటర్లు, కోచింగ్ సెంటర్లలో ప్రిపరేషన్ కొనసాగించి ఉద్యోగాలను సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు గతంలో నిరుద్యోగుల శిక్షణ కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. కోచింగ్కు వచ్చే వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయగానే నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్లు సిద్ధమయ్యాయి.
స్టడీ సెంటర్లలో మెరుగైన శిక్షణ..
హైదరాబాద్కు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకొనే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి నిరుద్యోగులకు స్థానిక స్టడీ సెంటర్లు వరంగా మారాయి. కొవిడ్ నేపథ్యం లో భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటి స్తూ తరగతులను నిర్వహించేందుకు శిక్షణ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆమనగల్లు, ఇబ్రహీంపట్నంలలో ఎమ్మెల్యేల సహకారంతో పోలీసులు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి రెండు నెలలపాటు నిరుద్యోగులకు పలు సబ్జెక్టుల్లో నిపుణులతో ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పించారు. పలు మండలాలకు చెం దిన వందలాది మంది నిరుద్యోగులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. శిక్షణ కు వచ్చిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ను కూడా పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటామని ప్రకటించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలనే తపనతో ఇప్పటికే ప్రిపరేషన్ను ప్రారంభించారు.
ఖాళీల వివరాలను డీఈవోకు నివేదించాం
మండలాల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను కాంప్లెక్స్ల వారీగా సేకరించి డీఈవోకు పంపించడం జరిగింది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, పదోన్నతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం వివరాలు తీసుకొన్నాం. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో పాఠశాలల వారీగా విద్యాధికారులు సూచించిన విధంగా వివరాలను జిల్లా విద్యాధికారికి నివేదించాం.
-సర్దార్నాయక్,ఎంఈవో, ఆమనగల్లు
టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా..
టీచర్ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో ఇంటి వద్దనే ఉంటూ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నా. ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తామని ప్రకటించడం సంతోషకరం. ప్రిపరేషన్కు అవసరమైన స్టడీ మెటీరియల్ను సిద్ధం చేసుకున్నా. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తే వేలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినట్లు అవుతుంది. -రాజు, ఆమనగల్లు