రంగారెడ్డి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా నిలుస్తున్నాయి. వార్షిక రుణ ప్రణాళికను పక్కాగా అమలు చేయించి బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అందించి ఆర్థిక భరోసాను నింపుతున్నాయి. ఇటీవల వెల్లడించిన వార్షిక రుణ ప్రణాళికలో అంతకుమించి అన్నట్లుగా బ్యాంకులు ఇతోధికంగా రుణాలను మంజూరు చేసినట్లు స్పష్టమవుతున్నది.
ఈ ఏడాది జిల్లా లీడ్ బ్యాంక్ రూపొందించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.24,157.65 కోట్లు కాగా, డిసెంబర్ మాసం నాటికి రూ.35,553.73 కోట్ల మేర రుణాలను బ్యాంకులు వివిధ రంగాలకు అందించాయి. నిర్దేశిత లక్ష్యం కంటే 147.17 శాతం లక్ష్యాన్ని సాధించడంలో అటు బ్యాంకులు, ఇటు జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. నిధుల కేటాయింపులో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి పంట రుణాలను 3,550.6కోట్లు (127.15) డిసెంబర్లోనే లక్ష్యానికి మించి బ్యాంకులు రైతులకు అందజేశాయి.
జిల్లాలోని ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాలు అందించేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రణాళిక తయారవుతుంది. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా ఆయా రంగాలకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఈ ఏడాది గతానికి భిన్నంగా రెండు మూడు రంగాలకు మినహా ప్రణాళిక లక్ష్యానికి మించి రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. పంట రుణాల లక్ష్యం 2,792.53 కోట్లు కాగా, బ్యాంకులు 3,550.61 కోట్లను రైతాంగానికి అందించాయి.
ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు 7,686.39 కోట్ల రుణాలకుగాను ఇప్పటి వరకు 5,753.01(74.85) కోట్ల రుణాలను అందజేశాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వయం సహాయక మహిళా సంఘాలకు 70,992.77 లక్షల రుణ లక్ష్యానికిగాను డిసెంబర్ నాటికి 68,969.87 (97.15 శాతం) కోట్ల రుణాలను పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలోని సంఘాలకు 9,834.63 లక్షల రుణాలను ఇవ్వాలని సంకల్పించి ఇప్పటి వరకు రూ.9,037.57 (91.90 శాతం) లక్షల రుణాలను బ్యాంకులు అందజేశాయి.
జిల్లాలో కొన్ని రంగాలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు వెనుకంజలో ఉన్నారు. ఏటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి రుణాలను అందజేయడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. రూ.447.13కోట్ల రుణ లక్ష్యానికిగాను 61.60 (13.78) కోట్లను మాత్రమే అందించి మమ అనిపించాయి. విద్యా రంగానికి రూ.125.03 కోట్ల రుణాలను అందించాల్సి ఉండగా.. 68.17 (54.52 శాతం) రుణాలను మాత్రమే బ్యాంకులు ఇచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇండ్లను నిర్మించుకోవడానికి బ్యాంకు రుణాలపై ఆధారపడతారు.
ఇండ్లను నిర్మించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజల అవసరాల మేరకు బ్యాంకులు గృహ రుణాలను మాత్రం అందించలేక పోతున్నాయి. ఈ ఏడాదిలో రూ.1,156.68 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 427.68 (36.97) కోట్ల రుణాలను మాత్రమే ఇవ్వగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెలన్నర రోజులు మిగిలిపోవడంతో రుణ లక్ష్యంలో వెనుకబడ్డ రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందజేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు.