వికారాబాద్, ఫిబ్రవరి 26 : వికారాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.24.35 కోట్లతో పనులను చేపట్టి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం వికారాబాద్ రైల్వే జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద వికారాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో.. స్కీమును వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో రైల్వేస్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలన్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి గది నిర్మించాలని సూచించారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్, టాయిలెట్స్ నిర్మాణాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ఏ మాత్రమూ సహకరించలేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వికారాబాద్ రైల్వేస్టేషన్కు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు సంవత్సరంలో పూర్తవుతాయన్నారు. ఎంఎంటీఎస్ రైలును శంకర్పల్లి, వికారాబాద్ వరకు పొడిగించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు.
త్వరలో తాండూరు రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50 శాతం నిధులు తీసుకొస్తామని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేయాలని సూచించారు. వికారాబాద్ రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్, వైఫై, మూత్రశాలలు, ఓవర్ బ్రిడ్జి వంటి తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నటు ఆయన తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
షాద్నగర్ : ప్రజల అవసరాలకు అనుగుణంగా షాద్నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే సౌకర్యాలు మరింత పెరగాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్నగర్లోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అమృత్ భారత్ను దేశ ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. షాద్నగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9.59 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షదాయకమన్నారు.
షాద్నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని, అన్ని రకాల రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైల్వే పట్టాల కింద నిర్మించే వంతెనలతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోతున్నదని, వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
రతన్ కాలనీ వాసులకు ఇబ్బందులు కలుగకుండా రైల్వే శాఖ అధికారులు చొరవ చూపాలని, గత కొన్నాళ్లుగా ఉన్న రోడ్డు మార్గానికి ఇబ్బందులు కలిగించడం సరికాదని చెప్పారు. చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ తీరును మార్చేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్యముదిరాజ్, నాయకులు వెంకటేశ్గుప్తా, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్యాదవ్, మోహన్, గోపాల్గుప్తా, మనోహర్రెడ్డి, వెంకటేశ్, రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.