యాచారం, డిసెంబర్ 7 : వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అనుకూలంగా మార్పుల చేర్పులతో క్రమబద్ధీకరణ చేసి అందించడం, క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పర్చడం, మెట్ట పంటల సాగులో ఆధునిక పద్ధతులు, సేంద్రియ ఎరువులు, యాంత్రీకరణతో మెట్ట పంటల రకాలు, వాటిని సాగు చేసే పద్ధతులను రైతులకు అవగాహన కల్పించడం, క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశీలనలు జరిపి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం కోసం మండలంలోని గున్గల్లో హైదరాబాద్కు 35కిమీ దూరంలో కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. 60సంవత్సరాలుగా రైతు కుటుంబాలకు వినూత్నంగా అనేక రకాలుగా ఉపయోగపడుతూ వ్యవసాయ రంగాన్ని విస్తరించడంలో గున్గల్ క్రీడా క్షేత్రం కీలకపాత్ర పోషిస్తున్నది.
యాచారం మండల పరిధిలోని గున్గల్ గేటు సమీపంలో గున్గల్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనాక్షేత్రం ఉన్నది. ఎనభై ఎకరాల విస్తీర్ణంలో 1961లో ఈ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఈ పరిశోధనాక్షేత్రంలో కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనలు శాస్త్రవేత్తలతో నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో నలభై ఎకరాల్లో వివిధ రకాల మెట్ట పంటలను సాగుచేయగా మరో నలభై ఎకరాల్లో రిజర్వు ఫారెస్ట్ ఉన్నది. ఈ క్షేత్రాన్ని క్రీడా (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్) అంటారు. జిల్లాలోనే ఈ పరిశోధనా క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందగా, ఎన్నో ఏండ్లుగా యాచారంతో పాటుగా చుట్టు పక్కల మండలాల రైతుల పాలిట నేస్తంగా మారింది. ఆధునిక పద్ధతులతో మెట్ట పంటల సాగుపై శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు తరచూ అవగాహన కల్పిస్తారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి, జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ తన స్థానాన్ని నిలుపుకున్నది. ఈ క్షేత్రం విదేశీయుల పర్యటనకు సైతం కేంద్రంగా నిలుస్తున్నది. ఇది కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్నది.
మెట్టపంటలకు నిలయం
గున్గల్ వ్యవసాయ క్రీడాక్షేత్రం మెట్టపంటల సాగుకు ఎంతో ప్రసిద్ధి. నలభై ఎకరాల్లో అనేక రకాల మెట్టపంటలను సాగుచేసి, ఆ పంటలపై అనేక ప్రయోగాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిర్వహిస్తారు. వ్యవసాయంలో పండించే మెట్టపంటలన్నీ ఈ క్షేత్రంలో సాగుచేయటం విశేషం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అంతరించి పోతున్న మెట్టపంటలు, చిరుధాన్యాలు సాగును క్రీడాలో సాగు చేస్తూ, రైతులకు వాటి సాగు, సస్యరక్షణలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ఈ పంటలను కొంత మంది రైతులు ఆదర్శంగా తీసుకొని తమ పొలాల్లో మెట్టపంటలను సాగు చేస్తున్నారు. క్రీడా క్షేత్రంలో ఆధునిక యంత్రాలతో ఆముదం, పొద్దు తిరుగుడు, వేరుశనగ, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుములు, బొబ్బర్లు, ఉలువలు, రాగులు, పత్తి, తీగజాతి, టమాట, మిరప, నూనె గింజలు, పప్పు దినుసులు, అధిక దిగుబడి వంగడాలు, మామిడితో పాటుగా పశుగ్రాసం, అంతర పంటలను ఇక్కడ సాగుచేస్తారు. వాటి యాజమాన్యం వానకాలం, యాసంగి సీజన్లలో వేయాల్సిన పంటలను సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే సాగుచేసి రైతులకెంతో ఆదర్శంగా నిలుస్తారు. రైతులు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆయా పంటలను పరిశీలించి, శాస్త్రవేత్తల ద్వారా సలహాలు, సూచనలు, జాగ్రత్తలను తెలుసుకుంటారు. వారు సేకరించిన సమాచారంతో ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులు పొందుతారు. నీటినిల్వ(పాంపాండ్), వర్షపు నీరు నిలుపుదలకు సంబంధించి ఇంకుడు గుంతలు, ఆనకట్టలు సైతం క్షేత్రంలో దర్శనమిస్తాయి. రిజర్వు ఫారెస్టులో నెమళ్లు, కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, ఏదులు, ఉడుములు, అనేక రకాల పక్షులు, మూగజీవాలు సంచరిస్తాయి వీటిని సైతం అధికారులు సంరక్షిస్తారు.
రైతులకు శిక్షణా శిబిరాలు
గున్గల్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనాక్షేత్రంలో ప్రతీ సంవత్సరం కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో రైతులకు పలుమార్లు అనేక రకాల వ్యవసాయ సంబంధిత విభాగాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి మెట్ట పంటల సాగుపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా రైతు దినోత్సవం, క్షేత్ర ప్రదర్శనాదినాలు, నూతన యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ విజ్ఞాన ఆధారిత లఘు చిత్రాల ప్రదర్శన, సాంకేతిక వారోత్సవాలు, రైతు విజ్ఞాన యాత్రలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాల సందర్భంగా రైతులకు మెట్టపంటల సస్య విజ్ఞానం, సస్యరక్షణ, భూ సంరక్షణ, వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యాన శాస్త్రం, వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, గృహ విజ్ఞానం, ఆధునిక పద్ధతులు, జీవన ఎరువులు, వాన పాముల ఎరువులు, సేంద్రియ ఎరువులతో పాటు పూలు, ఔషధ మొక్కలు లాంటి మెట్టపంటల సాగుపై, భూ సారా పరీక్షలు, మట్టి నమూనా పరీక్షలపై రైతులకు శాస్త్రవేత్తలు, శాస్త్ర నిపుణులు, వ్యవసాయ అధికారులు తగిన శిక్షణనిస్తారు.
సీజనల్గా పరిశోధనలు
వ్యవసాయంలో వానకాలం, యాసంగి సీజనల్గా మెట్టపంటలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తారు. ఏ నేలలో ఎలాంటి విత్తనాలు, పంటలు వేయాలి, ఏయే పంటలకు ఏ సమయంలో ఎలాంటి ఎరువులు, మందులు వాడాలో పంటలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రయోగాలు నిర్వహిస్తారు. శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులకు పరిశోధనల అనంతరం చేపట్టాల్సిన విప్లవాత్మక మార్పుల సూచనలు అందజేస్తారు. పండించిన పంటలకు సోకిన తెగుళ్లు, చీడపీడల నివారణపై పరిశోధనలు చేసి వాటికి చేపట్టాల్సిన సస్యరక్షణలపై ప్రయోగాలు చేసి రైతులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తారు. వీటిని అధికారులు ఇతర రాష్ర్టాల వ్యవసాయాధికారులు, రైతులకు అందజేస్తారు. దీంతో ఇక్కడి మెట్ట పంటలను ఇతర రాష్ర్టాల వ్యవసాయ ప్రతినిధులు, విదేశీ పర్యాటకులు సందర్శించి పరిశీలిస్తారు. వారి ప్రాంతాల్లో ఈ పద్ధతులను అనుసరించటానికి ఈ క్షేత్రం ఎంతో ఉపయోగపడుతున్నది. క్షేత్రంలో ఉన్న ఆధునిక యంత్రాలు, వాతావరణంలో వచ్చే మార్పులను సూచించే పరికరాలు, వర్షపాత నమోదును సూచించే ఆధునిక పరికరాలు వాటి ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించి, వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ఈ పరిశోధన క్షేత్రం ఎంతో ఉపయోగపడుతున్నది.
మెట్ట పంటల విత్తనోత్పత్తి
క్రీడా క్షేత్రంలో సేంద్రియ ఎరువులతో సాగు చేసిన వివిధ రకాల మెట్టపంటలు, చిరు ధాన్యాలు, నూనెగింజలు, పప్పు దినుసుల పంటలతో విత్తనోత్పత్తి చేపడుతారు. ఇక్కడి విత్తనాలను శాస్త్రవేత్తలు ల్యాబ్కు తరలించి విత్తన పరిశోధనలు చేస్తారు. నాణ్యమైన మేలిరకం విత్తనాలను తిరిగి రైతులకు సబ్సిడీ కింద విక్రయించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా చూస్తారు. రసాయన ఎరువులు కాకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడటంతో పంట అధిక దిగుబడి వస్తుండటంతో ఇక్కడ చేపట్టిన విత్తనోత్పత్తి ఎంతో ప్రసిద్ధి. దీంతో రైతులు ఎంతో మక్కువ చూపిస్తారు. ప్రభుత్వం వరి పంటకు బదులుగా ఇతర పంటలపై దృష్టి సారించాలని సూచించడంతో ప్రస్తుతం రైతులు మెట్ట పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. ఇలాంటి సమయంలో గున్గల్ క్రీడా క్షేత్రం రైతులకు నేస్తంగా మారనున్నది.
వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచుతున్నది
గున్గల్ క్రీడా క్షేత్రంతో రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం పెరుగుతున్నది. వ్యవసాయ సంబంధిత విభాగాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిచడంతో రైతుల్లో చైతన్యం పెరుగుతున్నది. శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పరుస్తున్నారు. పరిశోధన క్షేత్రం ఎంతో రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.