తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ పూల జాతరను ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో రాష్ట్ర సర్కార్ ప్రతీ ఏడాది చీరలను కానుకలుగా ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపుతున్నది. ఈ ఏడాది బతుకమ్మ చీరలు విభిన్నమైన 250 డిజైన్లతో అద్భుతంగా రూపుదిద్దుకోగా, ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ద్వారా గొడౌన్ల నుంచి మండలాలు, మున్సిపాలిటీలకు చేర్చింది. నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రకరకాల రంగులతో అందంగా, నాణ్యతగా సిరిసిల్ల కార్మికులతో నేసిన చీరలు ఆడబిడ్డలు నచ్చేలా.. మెచ్చేలా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 5.59 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, 18 ఏండ్లు నిండిన 7,37,646 మందికి చీరలను అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. బుధవారం కౌకుంట్లతో పాటు శంకర్పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితారెడ్డి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడుతలో భాగంగా జిల్లాలో 3,97,000 మందికి చీరలను పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– రంగారెడ్డి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : మన సంస్కృతికి ప్రతీక.. అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ.. దసరా పండుగను పురస్కరించుకుని ఈ ఏడాది కూడా తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా చీరలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేలా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 250 డిజైన్లలో అతివలను ఆకట్టుకునే రీతిలో ప్రభుత్వం నేత కార్మికులతో చీరలను నేయించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ గోడౌన్ల నుంచి మండలాలు, మున్సిపాలిటీలకు చీరలు చేరాయి. నేటి నుంచి జిల్లావ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. జిల్లా పరిధిలో తొలి విడుతలో 3,97,000 మంది అతివలకు చీరలను పంపిణీ చేయనున్నారు.
తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగను అతివలు ఆనందంగా జరుపుకొనేలా ప్రతి యేటా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతీ ఆడబిడ్డను తోబుట్టువుగా గౌరవిస్తూ సారెగా చీరను అందించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ప్రతి యేటా దసరాకు ముందుగానే చీరలను అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆడపడుచులు సంతోషంగా వేడుకలను జరుపుకొనేలా చీరలను కానుకగా ప్రభుత్వం ఇవ్వనున్నది. 250 విభిన్న డిజైన్లలో రకరకాల రంగులతో అందంగా, నాణ్యతగా ఉండేలా సిరిసిల్ల కార్మికులతో ప్రభుత్వం నేయించింది. పండుగకు ముందుగానే అర్హులైన మహిళలకు చీరలనందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ మహిళా మెచ్చేలా.. నచ్చేలా నాణ్యమైన వస్ర్తాలతో ప్రభుత్వం చీరలను నేయించిందని అధికారులు చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 5.59 లక్షల ఆహార భద్రత కార్డులుండగా.. 18 ఏండ్లు నిండినవారు 7,37,646 మంది ఉన్నారు. ఈమేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు అర్హులైన వారి జాబితాను మండలాలవారీగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. అందుకనుగుణంగా సర్కారు జిల్లాకు చీరలను కేటాయించింది. రెండు రోజుల క్రితమే ఆమనగల్లు, శంకర్పల్లి, మంచాలలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లకు చీరలు చేరాయి. మంగళవారం అన్ని మున్సిపాలిటీలు, మండలాలకు చీరలను తరలించారు. చీరలను అన్ని శాఖల సమన్వయంతో పంపిణీ చేసేలా టెస్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, చేనేత జౌళి శాఖలు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామస్థాయిలో పలు శాఖల సిబ్బంది సహకారంతో చీరలను పంపిణీ చేయనున్నారు. బుధవారం మంత్రి సబితారెడ్డి కౌకుంట్లతోపాటు శంకర్పల్లి మున్సిపాలిటీలో చీరల పంపిణీ చేయనున్నారు. మిగతాచోట్ల ఎమ్మెల్యేలు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
– ప్రభాకర్, డీఆర్డీవో
18 ఏండ్లు నిండిన మహిళల జాబితాను పౌర సరఫరాల శాఖ అందజేసింది. ఈ ప్రకారంగా ప్రభుత్వం చీరలను జిల్లాకు పంపించింది. తొలి విడుతలో 3.97 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నాం. ఇంకా అవసరమైతే ఇండెంట్ పెట్టి చీరలను తెప్పించి అందజేస్తాం. రేషన్ దుకాణాల ద్వారా చీరలను పంపిణీ చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.