పరిగి/షాబాద్, నవంబర్ 1 : కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారికి ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఓటరు జాబితాలో తప్పొప్పులను సవరించేందుకు అనుమతినిచ్చింది. సోమవారం ఎన్నికల కమిషన్ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. జనవరి 5న తుది జాబితా ప్రకటించనుంది. రంగారెడ్డి జిల్లాలో 31,49,800 మంది, వికారాబాద్ జిల్లాలో 9,01,623 ఓటర్లు ఉన్నారు. విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు మార్పు, ఫొటోలు లేకపోవడం వంటి ఇతర సమస్యలపై 2వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 31,49,800 మంది ఓటర్లు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 31,49,800 మంది ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 377 మంది ట్రాన్స్జెండర్లు, ఎన్ఆర్ఐలు, ఇతర ఓటర్లు కలిపి మరో 768 మంది ఉన్నారు.
వికారాబాద్ జిల్లాలో 9,01,623 మంది ఓటర్లు
వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు 9,01,646 మంది కాగా.. వారిలో పురుషులు 4,51,592, మహిళలు 4,49,593, ఇతరులు 24 మంది ఉన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ నిఖిల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. 2020-21లో జిల్లాలో 8,97,323 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 4,48,822, మహిళలు 4,48,020 మంది, సర్వీసు ఓటర్లు 458, ఇతరులు 23 మంది ఉండగా సోమవారం విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,01,623కు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లాలో 4,300 మంది ఓటర్లు పెరిగారు.
గరుడ యాప్లో నమోదు
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ స్టేషన్ల వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘం గరుడ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నూతన ఓటర్లు మీ-సేవ, ఇంటర్నెట్లతో పాటు స్మార్ట్ఫోన్ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6, అసెంబ్లీ నియోజకవర్గ మార్పు కోసం ఫారం-6, అసెంబ్లీ నియోజకవర్గంలో చిరునామా మారిన సమయంలో ఫారం-8ఏ, సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా ఓటర్ల సంఖ్య భారీగానే పెరుగనుంది.