లష్కర్గూడ గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్శాఖ కమిషనర్ శరత్
అబ్దుల్లాపూర్మెట్, ఫిబ్రవరి 14 : మండలంలోని లష్కర్గూడ గ్రామంలో పంచాయతీరాజ్శాఖ కమిషనర్ శరత్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. గ్రామంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సుర్మయిగూడలో రోజూ ఉదయం తాగునీరు వస్తుందా.. చెత్తబండి వస్తుందా లేదా అనే వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డులో తడి-పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువు తయారీ చేస్తున్న విధానాన్ని కార్యదర్శి బబితను అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వైకుంఠధామంలో ఇప్పటివరకు ఎన్ని దహనాలు జరిగాయని అడిగారు. వైకుంఠధామం చుట్టూ ఫెన్సింగ్లా చెట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా పెంచే మొక్కల పెంపకం సక్రమంగా లేదన్నారు. నిర్లక్ష్యం చేయకుండా మొక్కల పెంపకంలో శ్రద్ధ వహించాలని సూచించారు. గతంలో ట్యాంకర్లు, ట్రాక్టర్లు ఉండేవి కావని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతీ నెల పల్లెప్రగతి నిధులిస్తున్నదని వాటన్నిటినీ ఉపయోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. డంపింగ్యార్డులో తప్పనిసరిగా కంపోస్ట్ ఎరువు తయారుచేయాలన్నారు. వారం రోజుల్లో మరోసారి గ్రామానికి వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ దాస్గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, సర్పంచ్ పారిజాత, ఎంపీటీసీ సాయికుమార్గౌడ్, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో నీరజ, డీఎల్పీవో సంధ్యారాణి, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో వినోద, కార్యదర్శి బబిత, వార్డు సభ్యులున్నారు.