రంగారెడ్డి, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందినవారు.. దళితబంధు పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందజేయడంతో రూ.10లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. ఒకట్రెండు నెలల క్రితం వరకు కారు డ్రైవర్లుగా పనిచేసినవారు.. దళిత బంధు పథకంతో నేడు ఓనర్లయ్యారు. జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీఫామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. మరోవైపు జిల్లాలో దళిత బంధు పథకం అమలు వేగంగా జరుగుతున్నది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. దళిత బంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకుగాను ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.61.40 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 697 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాకు రూ.69.80 కోట్ల నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.61.40 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా, ఇప్పటివరకు 567 మంది లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో మొదటి విడుతలో షాద్నగర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరంలో 100, చేవెళ్లలో 82, ఇబ్రహీంపట్నంలో 100, ఎల్బీనగర్లో 81, కల్వకుర్తిలో 63, రాజేంద్రనగర్లో 100, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
నాడు కూలీ.. నేడు రోజుకు రూ.1500 సంపాదన
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. షాబాద్ మండలంలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన కళ్లెం శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. స్వయం ఉపాధి కోసం గత ప్రభుత్వాల హయాంలో పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఎలాంటి పథకం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద శ్రీనివాస్ను ఎంపిక చేసింది. గత నెలలో ప్రభుత్వం అందజేసిన రూ.10లక్షలతో స్విప్ట్ డిజైర్ కారు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ డీజిల్ ఖర్చులు పోగా రూ.1500వరకు సంపాదిస్తున్నాడు.
షాబాద్ మండలంలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన కళ్లెం శ్రీనివాస్ రోజు కూలీ. రెక్కాడితేగానీ డొక్కాడదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ‘దళితబంధు’ అతని జీవితంలో వెలుగులు నింపింది. ఈ పథకంలో భాగంగా శ్రీనివాస్కు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయం అందించగా గత నెలలో స్విప్ట్ డిజైర్ కారును కొనుగోలు చేసి ప్రజా రవాణాకు వినియోగిస్తున్నాడు.
దీంతో డీజిల్ ఖర్చులు పోగా రోజుకు రూ.1500వరకు సంపాదిస్తున్నాడు.
శ్రీనివాస్ ఒక్కడే కాదు.. ఇలా ఎంతోమంది నిరుపేదల కుటుంబాల్లో కాంతులు నింపుతున్నది దళితబంధు పథకం. మొన్నటివరకు దొరికిన పని చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించినవారు నేడు సుస్థిర జీవనోపాధి పొందుతున్నారు. కొందరు కారు, ట్రాక్టర్లకు ఓనైర్లెతే.. మరికొందరు మినీ డెయిరీ, పౌల్ట్రీఫామ్లకు యజమానులై మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 697 మంది దళితబంధు లబ్ధిదారుల కోసం రూ.69.80 కోట్ల నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.61.40 కోట్లు అందాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 567 మంది లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయింది.
-రంగారెడ్డి, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ)
లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలి
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
కోట్పల్లి, ఆగస్టు 3 : రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బెగరి లక్ష్మణ్కు మంజూరైన రూ.10లక్షల టెంట్ హౌజ్ను, ఎన్కెపల్లి గ్రామానికి చెందిన సాయన్న(సత్యం)కు మంజూరైన రూ.10 లక్షల స్టీల్, సిమెంట్ షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి రూ.10లక్షలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. ఎంచుకున్న యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనిల్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పంచ్ అనితారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ దశరథ్గౌడ్, సీనియర్ నాయకుడు ప్రతాప్రెడ్డి, సర్పంచులు, నాయకులున్నారు.
దళిత బంధుతో ధనవంతులు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 3 : సీఎం కేసీఆర్ ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో దళితులు ఒక్కసారిగా ధనవంతులుగా మారుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన కొండ్రు ప్రభు అనే వ్యక్తికి దళిత బంధు కింద మంజూరైన సెంట్రింగ్ మెటీరియల్ను బుధవారం ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దళితులకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా సత్ఫలితాలిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. దళిత బంధును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, కౌన్సిలర్లు మమత, సురేశ్, సుజాత, మంగ, బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు రాజు, రాజ్కుమార్, విజయ్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా కుటుంబానికి ఆసరాగా నిలిచింది
– కళ్లెం శ్రీనివాస్, బోడంపహాడ్(షాబాద్)
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచింది. ఇంతకు ముందు చిన్నపాటి పనులు చేసుకుంటే వచ్చే డబ్బులు దేనికీ సరిపోయేవి కాదు. దళిత బంధు ద్వారా రూ.10లక్షలతో కారు కొనుగోలు చేశాను. ప్రతిరోజూ కారు నడుపుకుంటున్నాను. ఖర్చులు పోగా మంచిగానే ఆదాయం వస్తున్నది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.