తీపి జ్ఞాపకాలు
తీపి అంటే ఇష్టం లేనిది ఎవరికి? మరీ ముఖ్యంగా పిల్లల్ని తీపి పదార్థాలనుంచి దూరం చేయడం కష్టం. పైగా ఇప్పటి తరానికి డార్క్ చాక్లెట్స్, కేక్స్, కూల్డ్రింక్స్
లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. తయారీ కంపెనీలూ పిల్లలే లక్ష్యంగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. ఒకపక్క ఎదిగే వయసులో పిల్లలు ఆడుకోవడానికి తగినంత వెసులుబాటు ఉండటం లేదు. మరోవైపు, మోతాదుకు మించిన కార్బొహైడ్రేట్లు (తీపి) వారి శరీరంలోకి పాకంలా పేరుకు పోతున్నాయి. దీనివల్ల చిన్నవయసులోనే ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు వస్తాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాజాగా, పిల్లలు చక్కెర పదార్థాలు తినడం అన్నది వారి మెదడుమీద కూడా ప్రభావం చూపుతుందని తేలింది. జార్జియా, దక్షిణ క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైన విషయమిది. పరిశోధకులు ఎలుకలకు భారీగా తీపి పదార్థాన్ని పెట్టినప్పుడు వాటి మెదడులోని ‘హిప్పోకేంపస్’ అనే భాగం పనితీరు దెబ్బతింటున్నట్టు తేలింది. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ, పాత విషయాలను గుర్తు చేసుకోవడంలోనూ హిప్పోకేంపస్దే ముఖ్యపాత్ర. అంటే, చదువుకునే వయసులో మరింత చురుగ్గా పనిచేయాల్సిన భాగమిది. కాబట్టి, ఈటింగ్ స్వీట్స్.. నోపప్పా!
దుమ్ము కొట్టుకుపోతుంది
లోకాన్ని కొవిడ్ కమ్ముకుని ఏడాది దాటుతున్నది. వెనక్కి తగ్గి విరుచుకుపడే సునామీలా, రెండోసారి విజృంభిస్తున్నది. తాజాగా mSystems అనే జర్నల్లో ప్రచురితమైన ఓ పరిశోధన, దుమ్ములో కొవిడ్ ఉనికి గురించి హెచ్చరిస్తున్నది. ఇప్పటివరకూ రోజువారీ వస్తువులమీద కొవిడ్ వైరస్ ఏ స్థాయిలో ఎన్నాళ్లపాటు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ, చుట్టూ ఉండే దుమ్ములో కొవిడ్ ఉనికిని కనుగొనే ప్రయత్నం మాత్రం తొలిసారిగా జరిగింది. ఆశ్చర్యంగా, కొవిడ్ రోగులు ఉన్నచోటునుంచి సేకరించిన దుమ్మును పరిశీలిస్తే, నెల రోజుల తర్వాతకూడా వైరస్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయట. ఇవి ఏ మేరకు కొవిడ్ను కలిగించగలవన్నది ఇంకా తేల లేదు. ఈ పరిశోధనవల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి: ఇక మీదట ఇంటి శుభ్రతను కూడా అశ్రద్ధ చేయకూడదనే హెచ్చరిక. రెండు: ఒక ప్రాంతంలోని దుమ్మునిబట్టి, అక్కడ కొవిడ్ స్థాయి ఎంతుందో పసిగట్టే అవకాశం ఉంటుంది.
25 కి.మీ. మాత్రమే
‘గర్భిణులతో కుదుపుల ప్రయాణాలు చేయించకూడదు’ అన్నమాట తరాలుగా వినిపిస్తున్నదే. కెనడాకు చెందిన హదీ మహమ్మదీ అనే ఇంజినీర్ కూడా ఈ మాటను వినే ఉంటాడు. అందుకే, ఆ మాటల్లో వాస్తవం ఎంతో తెలుసుకునే పరిశోధన చేశాడు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, స్పీడ్ బ్రేకర్లాంటి ఎగుడు దిగుళ్ల మీదుగా కారు ప్రయాణించినప్పుడు, కడుపులోని పిండంపై ఎలాంటి ప్రభావం ఉంటున్నదో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో అనూహ్యమైన విషయాలు బయటపడ్డాయి. కుదుపుల ప్రయాణం వల్ల శిశువు మెదడుకు దెబ్బ తగిలే ప్రమాదం ఉందనీ, గుండె వేగం పెరుగడం, మాయపొర మీద ఒత్తిడి కలగడం.. లాంటి సమస్యలు ఏర్పడవచ్చనీ తేలింది. అందుకే, కుదుపులు రాబోతున్నప్పుడు వాహనాల వేగం 25 కి.మీ.కు మించకుండా చూసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నాడు. నెలలు నిండిన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండా లన్నది ఈ ఇంజినీరు అందిస్తున్న మరో సూచన.
అరుపుల భాష
అడవిలో ఓ సరస్సు. వేసవి తాపానికి అక్కడికి చేరుకున్న జంతువులన్నీ హాయిగా సేద తీరుతున్నాయి. ఇంతలో అలజడి. సింహం అటుగా వస్తున్న అలికిడి. అంతే! ఒక్కసారిగా అక్కడి జీవులన్నీ కీచుమంటూ చప్పుడు చేశాయి. ప్రమాదాన్ని శంకిస్తూ తోటివారిని హెచ్చరించాయి. ఇదంతా మనకి కొత్త కాదు. ప్రమాదంలో అరవడం ఏ జంతువుకైనా సహజమే. మహా అయితే ఆటలాడుతున్నప్పుడు ఉద్వేగంతోనో, గాయం వల్ల కలిగే బాధతోనో అరుస్తామేమో! కానీ, మనిషి అంతకంటే పరిణతి చెందినవాడు కదా. అందుకే బాధ, భయం, కోపం, సుఖం, దుఖం, సంతోషం… ఇలా మొత్తం ఆరు సందర్భాలలో విభిన్నంగా అరుస్తాడట. అంతేకాదు, వినేవారుకూడా వీటి వెనుక అర్థాల్ని గ్రహించగలుగుతారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు మొట్టమొదటిసారిగా ఓ ప్రయోగం జరిగింది. జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలను PLOS Biology అనే పత్రికలో ప్రచురించారు. మనిషి స్పందనలనూ, వాటిని అర్థం చేసుకునే సామర్థ్యాన్నీ మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.