దారెస్ సలామ్: టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 21వ తేదీన స్థానిక స్టేడియంలో ఆయన భౌతికదేహానికి నివాళి అర్పించారు. ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. ఆ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో సుమారు 45 మంది మరణించినట్లు ఇవాళ పోలీసులు వెల్లడించారు. స్టేడియం వద్ద ఓపిక తగ్గిన జనం ఒక్కసారిగా నెట్టుకొచ్చారని, దాంతో తొక్కిసలాట జరిగిందని పోలీసు ఆఫీసర్ లజారో మామ్బోసా తెలిపారు. ఆ తొక్కిసలాటలో అనేక మంది గాయపడ్డట్లు కూడా ఆయన తెలిపారు. మార్చి 17వ తేదీన అధ్యక్షుడు మగుఫులి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలు విడిచినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. కానీ విపక్షాలు మాత్రం ఆయనకు కరోనా సోకినట్లు ఆరోపించింది. ఉహురూ స్టేడియంలో నిర్వహించిన నివాళి సభలో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నది. మార్చి 26వ తేదీన చాటో గ్రామంలో అధ్యక్షుడు మగుఫులి భౌతికదేహన్ని ఖననం చేశారు.