హైదరాబాద్, మార్చి 15 (నమస్తేతెలంగాణ): విశాఖ ఉక్కుప్లాంటు నూటికి నూరుశాతం ప్రైవేటీకరణకు నిర్ణయం జరిగిపోయిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పునరుద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని స్పష్టంచేశారు. విశాఖపట్నం స్టీల్ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కు ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమేనని పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ సభ్యుడు బాలశౌరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ.. విశాఖ స్టీల్తోపాటు దాని అనుబంధ సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థలన్నింటిలోనూ ప్రైవేటీకరణ రూపంలో వందశాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చేపట్టాలన్న ప్రతిపాదనను జనవరి 27న ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని బడ్జెట్లో అంచనావేశామని పేర్కొన్నారు. పీఎస్యూలలో ప్రైవేటు మూలధనం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా వాటి ఉత్పాదకత పెంచాలన్నదే ప్రైవేటీకరణ ఉద్దేశమని వెల్లడించారు. 2019-20లో 84 పీఎస్యులు తీవ్ర నష్టాలు మూటగట్టుకొన్నాయని.. ఒక్కొక్కదానికి ఒక్కో కారణమున్నదని చెప్పారు. ఉమ్మడి కారణం మాత్రం మూలధన కొరత, పాతకాలపు ప్లాంట్ అండ్ మిషనరీ, కాలం చెల్లిన టెక్నాలజీ, తక్కువ వినియోగసామర్థ్యం, తక్కువ ఉత్పాదకత, ఆస్తులు, అప్పుల వాటా (డెట్-ఈక్విటీ స్ట్రక్చర్) నిర్మాణం సరిగా లేకపోవడం, ఉద్యోగులసంఖ్య అధికంగా ఉండటం, బలహీనమైన మార్కెటింగ్ వ్యూహాలు, మార్కెట్లో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, ఇన్నోవేషన్ కొరవడటం, ప్రభుత్వ ఆర్డర్లపై అత్యధికంగా ఆధారపడటమేనని నిర్మాలా సీతారామన్ వివరించారు.