భారత పూర్వ ప్రధాని, తెలంగాణ బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నతరుణంలో పట్టభద్రులు వాణీదేవిని గెలిపించి పీవీ పట్ల తమకున్న గౌరవ ప్రపత్తులను, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల తమకున్న అభిమానాన్ని , విశ్వాసాన్ని ఏకకాలంలో ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల మీద కర్ర పెత్తనం చేయాలనుకునే జాతీయ పార్టీలకు ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలోఉన్న భారతీయ జనతా పార్టీకి పట్టభద్రులు కర్ర కాల్చి వాత పెట్టారు. హుస్సేన్ సాగర్ సాక్షిగా పి.వి. భౌతిక కాయానికి జరిగిన అవమానాన్ని ఇన్నాళ్ళూ గుండెల్లో దాచుకున్న తెలంగాణ బిడ్డలు తగిన బుద్ధి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తిరుగులేదని మరోసారి చాటారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వం కొన్ని నెలలు ముందుగానే ఖరారయింది. ఆయన ప్రచారంలో అందరి కన్నా ముందుగా దూసుకుపోయారు. ఉత్కంఠ అంతా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్ర స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్నదే. విపక్షాలను కోలుకోలేని దెబ్బతీయాలని ప్రత్యేకించి బీజేపీ నేతల వీరంగాలకు దీటైన సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా మేధోమథనం సాగించారు. కానీ దీనిని విపక్షాలు అర్థం చేసుకోలేక పోయాయి. కాలయాపన వెనుక ఉన్న వ్యూహాన్ని అంచనా వేయలేక పోయాయి. విపరీత వ్యాఖ్యానాలు చేశాయి. అసలు టీఆర్ఎస్కు హైదరాబాద్ స్థానం నుంచి పోటీచేయగలిగే అభ్యర్థులే కరువయ్యారని ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు. విధిలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ముఖం చాటేయబోతున్నాడని దుష్ప్రచారాలు చేశారు. వీటన్నింటికీ సమాధానంగా కేసీఆర్ సంధించిన అస్త్రం సురభి వాణీదేవి. గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించి ఒక అపురూపమైన విజయాన్ని అందించింది.
హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి వాణీదేవిని ప్రకటించిన రోజే గెలుపు దాదాపు ఖాయమైంది. ఆమె విద్యాధికురాలు, విద్యాసంస్థల నిర్వాహకురాలు. ప్రధాని కూతురైనప్పటికీ సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం గలవారు. వాణీదేవిపై ఏ విమర్శలు చేయాలో తెలియక ప్రత్యర్థులు తలలు పట్టుకుంటుంటే కేసీఆర్ రాజకీయ చతురతకు ప్రజలు జేజేలు పలికారు. అందరినోటా ఒకే మాట అభ్యర్థి ఎంపిక అదిరిపోయిందని. నిరాశానిస్పృహలకు లోనైన విపక్షాలు పసలేని విమర్శలు చేశాయి. వాణీదేవికి ఓడిపోయే సీటు కట్టబెట్టి బలిపశువును చేస్తున్నారని, గవర్నర్ కోటాలోనో, శాసనసభ్యుల కోటాలోనో ఎమ్మెల్సీ ఇవ్చవచ్చు కదా అని కొత్త పల్లవి అందుకున్నారు. ఆమె మహిళ కనుక రాజకీయాల్లో రాణించలేరనే వివక్షాపూరిత ధోరణి కూడా వారి విమర్శలలో ధ్వనించింది. కానీ పీవీ తనయగా తాను జయాపజయాలను తన తండ్రిలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో తేల్చుకుంటానని వాణీదేవి చెప్పడంలో ఆమె ధైర్యం ద్యోతకమైంది. అయినా ప్రత్యర్థులు పదేపదే పాత పల్లవులను ఆలాపించటం పట్టభద్రులకు నచ్చలేదు. ఆమె ప్రత్యక్షరాజకీయాలకు అసమర్థురాలనే విధంగా ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం ప్రజలు సహించలేక పోయారు.
ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ యథావిధిగా కేసీఆర్ను రకరకాలుగా దుమ్మెత్తిపోయడంలోనే గడిపింది. తెలంగాణకు తాను చేసిందేమిటో కనీసం ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రరావు చేసిందేమిటో చెప్పిన పాపాన పోలేదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం కుప్పకూలిపోతుందని సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించటం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్య చకితులను చేసింది. ప్రభుత్వ అస్తిత్వానికి శాసనమండలి బలాబలాలకు ఏమాత్రం సంబంధం ఉండదన్న కనీస అవగాహన వారికి లేకపోవటం నవ్వు తెప్పించింది. అలా అనుకుంటే గత జనవరిలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే బీజేపీ ఓడిపోయింది. అక్కడి ప్రభుత్వం కూలిపోలేదే? ఆమాత్రం విచక్షణ లేకపోతే ఎట్లా..!
వాణీదేవి ప్రసంగాలలో కాని, ఆమె తరపున ప్రచారం చేసిన పార్టీ శ్రేణుల ప్రసంగాల్లో కాని విపక్షాల లాగా గందరగోళం లేదు. ప్రత్యర్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే సూటి ప్రశ్నలను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంధించారు. ఉద్యోగ కల్పన విషయంలో ఆయన ప్రకటించిన శ్వేత పత్రం వాస్తవాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జీడీపీ కి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలను సమన్వయించి చమత్కరించటం విద్యావంతులను ఆకట్టుకున్నది. ఓటు వేయటానికి వెళ్లేముందు సిలిండర్కు దండం పెట్టి వెళ్లండంటూ గతంలో మోదీ చేసిన ప్రకటనను చక్కగా ఉపయోగించారు. వాణీదేవి ఎంతో హుందాగా ప్రచారం సాగించారు. ఆమె అనునయంగా చేతులు జోడించి ఓట్లను అభ్యర్థించడం పట్టభద్రులకు బాగా నచ్చింది. కాంగ్రెస్ పార్టీ పీవీకి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా లేదా పీవీ రుణం తీర్చుకునే విధంగా వాణీదేవికి మద్దతు ప్రకటించి తప్పుకుంటే ఎంతో హుందాగా ఉండేది. పీవీని అవమానించిన ఆ పార్టీని ప్రజలు చిత్తుచిత్తు చేశారు.
రాజకీయాల్లో స్థిరమైన విజయాలు ఉంటాయి. తాత్కాలిక విజయాలు ఉంటాయి. స్థిరమైన విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్కు ఒకటీ అరా పరాజయాలు సంభవించవచ్చు గాక. అంతటితో అంతా అయిపోయిందని అనుకోవడం విపక్షాల అపరిపక్వతకు నిదర్శనం. వరుస పరాజయాలు మూటకట్టుకుంటూ ఒకటి అరా విజయాలు సాధించగానే విర్రవీగడం అహంకారానికి నిదర్శనం. కేసీఆర్ను ఢీకొని స్థిరంగా నిలువగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికీ, ఏపార్టీకీ లేవు. కేసీఆర్ అజేయుడు. పట్టభద్రుల తీర్పు సారాంశమిదే.
అయాచితం శ్రీధర్