PV Narasimha Rao | ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి వరకు ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన పీవీ తన రాజకీయపు తొలినాళ్లలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తగా పనిచేశారు. ఈ విష యం చాలామందికి తెలియదు. ఆయన ఆలయ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని గ్రంథ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ సంకెపల్లి నాగేంద్రశర్మ తెలిపారు.
పీవీ నరసింహారావుకు వేములవాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజన్న క్షేత్రాన్ని తరచూ సందర్శించేవారు. ఆలయ అభివృద్ధికి కూడా ఎంతో కృషిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1969-70లో పీవీ ఆయనతో కలిసి వేములవాడ ఆలయ సందర్శనకు వచ్చారు. అప్పుడు జాత్రా మైదానంలో ధర్మశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్యాగరాజస్వామి వారి సంగీతోత్సవాలను వేములవాడ రాజన్న గుడి కళావేదిక నుంచి ప్రారంభించారు. వేములవాడ ఆలయ అర్చకుల ఘర్పట్టీ పారితోషికాన్ని 60 వేలకు పెంచి ఆలయ ఆనువంశిక అర్చకులకు అండగా నిలిచారు. 1966 నాటి దేవాదాయ ధర్మాదాయశాఖ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఒక యువ జర్నలిస్టుగా పీవీ చేసిన సేవలను దగ్గరినుంచి చూడగలిగాను. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక పీవీ నేరుగా వేములవాడకు రాకపోయినా ఇక్కడి తన స్నేహితుల యోగక్షేమాలను తెలుసుకునేవారు. సత్సంబంధాలను కొనసాగించారు.
ఆచరణ అన్నింటికన్నా ముఖ్యం
అందరూ పీవీ నరసింహారావు మేధావి, అపర చాణక్యుడు.. రాజనీతిజ్ఞుడు.. సాహితీవేత్త అని అభివర్ణిస్తుంటారు. అవన్నీ నిజమే కానీ అన్నింటికీ మించి గొప్ప ఆచరణశీలి. అందుకు భూసంస్కరణలే ఒక నిదర్శనం. తన భూములను పేదలకు పంచిన మహనీయుడు. మంచి స్నేహశీలి. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా సామాన్యుడిగా జీవించారు. వేములవాడ ఆలయ ఆనువంశిక సుప్రభాత కవి, మధురకవి బిరుదాంకితుడు మామిడిపల్లి సాంబకవితో పీవీకి మంచి స్నేహసంబంధాలున్నాయి. ఆయన నిరుపేద. ఆయనతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతాన్ని సంస్కృతంలో రాయించడమే కాక, జీవనభృతిని కల్పింపజేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక పీవీ వేములవాడ రాకపోయినా సాంబకవి యోగక్షేమాలను తెలుసుకుంటుండేవారు.
సాహితీ స్ఫూర్తి
పీవీ సాహిత్యం అమోఘం. పలు భాషల్లో ప్రావీణ్యులు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్దండ కవి పండితుడి నవలనే తర్జుమా చేసిన ఘనత ఆయనది. పీవీ సాహిత్యాన్ని చదివిన నేను ఒకరకంగా వాటినుంచే స్ఫూర్తి పొందాను. ఇతర భాషలపై పట్టు సాధించేందుకు కృషిచేశాను. పీవీ స్ఫూర్తితోనే పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో పనిచేస్తూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న. ఇప్పటివరకు 12 పుస్తకాలను రచించాను.