రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. అత్యంత భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తెల్లవార్లూ ప్రమాదకరస్థాయిలో వర్షం కురిసింది. సిరిసిల్లను వరదనీరు ముంచెత్తింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లు నదులను తలపించాయి. వాగులు, వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్లో ప్రధానరహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. 30 ఏండ్ల తర్వాత ఇంత భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
పైకి వస్తున్న పాతాళగంగ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జలాలు భూ సమాంతరానికి చేరాయి. బావుల్లో నీరు నిండి బయటకు పారుతుండగా.. బోరుబావులు వాటికి అవే నీటిని ఎత్తి పోస్తున్నాయి. ధన్నూర్ (కే) గ్రామానికి చెందిన ఆసాల పెద్దన్న అనే రైతు పొలంలో మంగళవారం నీటిని ఎత్తిపోస్తున్న బోరుబావిని ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.