నిత్య జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అందులోనూ మతిమరుపు మనుషులను ఓ పట్టాన మరిచిపోలేం. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘ఉషికెల ఉంగురం పెట్టి పప్పుల దేవులాడినట్టు’. వాళ్ల స్వభావమే అంత. ఏదైనా నిమిషాల్లో మర్చిపోతారు. వెనకటికి ఓ పెద్దాయన ఉషికె (ఇసుక)లో ఆడే ఆటల్లో మునిగిపోయి.. చేతికున్న ఉంగరం అందులోనే మర్చిపోయిండట.
ఆ తర్వాత గుర్తుకొచ్చి.. వంటింట్లో పప్పుడబ్బాలో వెతుకుతున్నాడట. అతని గురించి తెలిసిన ఇంటివారు, ఇసుకలో ఆడుకున్నావు కాబట్టి, వెళ్లి ఇసుకలోనే వెతకమని హెచ్చరించారట. అప్పటికి కానీ ఉంగరం దొరకలేదు. ఇట్లాగే ఎంతోమంది ఒకచోట ఉంచి, మరోచోట వెతుకుతుంటారు. ఇలాంటి అర్థాన్నే ఇచ్చే సామెతలు.. ‘అడవిల పోగొట్టుకొని అంగట్ల లెంకులాడినట్లు’, ‘పెసర చేన్ల పోగొట్టుకొని పప్పు అటికెల దేవులాడినట్టు’. కాబట్టే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి.