జానపదులు అనుభవపూర్వకంగా చెప్పిన సామెతల్లో ఇదొకటి. ఎన్ని తరాలు మారినా ఈ సామెత కొత్త అర్థాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ.. ఆగమాగం అవుతుంటారు కొందరు. అలాంటివారిని ఉద్దేశించి ‘ఏమ్రా ఉర్కుర్కి పసులుగాస్తే.. సరిపోద్దా..? పొద్దు గూకొద్దారా?’ అంటుంటారు. ఈ సామెతలో పసులు అంటే పశువులు-ఆవులు, ఎడ్లు, గేదెలు వంటి జీవాలు. ఆదరాబాదరాగా చేసే ఏ పనైనా మంచి ఫలితాలు ఇవ్వదు. తొందరపాటు అన్ని వేళలా ఉపయోగపడదని చెప్పే సందర్భం ఇది. త్వరగా పొద్దుగూకాలనే ఆత్రుతతో ఉర్కుర్కి పశువులను గాస్తే కాళ్లనొప్పులు వస్తాయే కానీ, కాలం తొందరగా గడవదు. దేనికైనా సమయం రావాలి. తొందరపడితే ఏ పనులూ కావు. అన్నిటికీ కాలమే పరిష్కారం చూపుతుందని నమ్ముతారు జానపదులు.
అన్నిసార్ల్లూ అవకాశాలు అందరికీ రావు. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని, సమయం మించిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని గుర్తుచేసే సందర్భంలో ‘పండ్ల్లున్నప్పుడే శెనగలు తినాలె’ సామెతను ఉపయోగిస్తారు. నోటి పండ్లు గట్టిగా ఉన్నప్పుడే శెనగలు తినాలి. వృద్ధాప్యంలో పండ్లు రాలిపోవడం ప్రారంభమయ్యాక శెనగలు తినడం కష్టం. కాదని తినే ప్రయత్నం చేస్తే అవి నోటిలో ఓ పట్టాన నలగవు. పోనీ అలాగే మింగేస్తే అరగవు. పైగా అనారోగ్యం కూడా. ఇలాంటి అర్థాన్నిచ్చే సామెతల్లో ‘ముద్దొచ్చినప్పుడే సంక ఎక్కాలె..’, ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలె..’ వంటివి ముఖ్యమైనవి. రాత్రిళ్లు దీపం/కరెంట్ వంటి సౌకర్యం ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. దీపం ఆరిపోతే చిమ్మచీకట్లో ఏ పనీ చేయలేం. కాబట్టి, అవకాశాలు వచ్చినప్పుడే వాటిని ఒడిసి పట్టుకోవాలని సూచిస్తూ ఇలాంటి సామెతలను అనుభవ పూర్వకంగా చెప్పారు మన పెద్దలు.
‘కొత్త దంపతులు ఇంట్లకెల్లేందుకు మిత్తి తీయిస్తరట. తొరగా రండ్రళ్లో..’ అంటూ ఓ రకమైన హడావుడి ఉంటుంది పెండ్లి ఇంట్ల. ‘మిత్తి తీసుడు’ అంటే వడ్డీకి వచ్చిన డబ్బు తీసుకోవడమని కొందరు భ్రమ
పడుతుంటారు. మిత్తి తీసుడంటే దిష్టి తీయడం. తెలంగాణలో దిష్టి తీయడం అనేది.. అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, దిష్టి తీయడాల్లోనూ ఎన్నో రకాలున్నాయి. దూర ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు, అదురుకున్నప్పుడు, నరదిష్టి తగిలినప్పుడు, గాలి సోకినప్పుడు.. కొత్తగా పెండ్లయిన వాళ్లు ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు.. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా దిష్టి తీస్తుంటారు. వాటిలో ఒకటి ‘మిత్తి తీసుడు’. ఇది పెండ్లయిన కొత్తజంట ఇంట్లోకి వచ్చేటప్పుడు చేటలో బియ్యం, కుంకుమ కలిపి దిష్టితీస్తారు. నూతన దంపతులపై దిష్టిగా తీసిన మిత్తిబియ్యాన్ని కొన్ని సామాజిక వర్గాలవారు తీసుకోవడం ఆనవాయితీ. కొత్తగా ఇండ్లలోకి వెళ్లేటప్పుడు కూడా మిత్తి తీస్తారు. అప్పుడు పరమాన్నం, కుంకుమ కలిపి దిష్టి తీస్తారు. మిత్తి తీసుడు శుభసూచకం.
బౌరూపు పల్కులు = డాంబికాలు, ఏమీ తెలియకున్నా అన్నీ తెలుసని అనుకునే అతిశయం (నీ జీవితం మొత్తం ఇలా బౌరూపు పలుకులతోనే కాలం గడిపేస్తవా? నిదానంగా ఏదీ తెలుసుకోవా? ఎందుకురా అంత తుత్తర? ఏం ఫాయిదా బిడ్డా నీవల్ల?)
గెదడు కంపు = జీవాల దగ్గర్నుంచి వచ్చే ఒక రకమైన దుర్వాసన (ఎన్ని దినాలైందిరా తానంజేసి.. నువ్వత్తేసాలు గెదడు కంపు గుప్పిచ్చికొడ్తుంది. వెళ్లు.. పెయ్యంత శుభ్రం చేస్కోపో..)
మిర్ర = కోపం (గింతలేడు పోరడు పెయ్యంతా మిర్రే. ఎట్ల బత్కుతవ్రా? నలుగుట్ల ఒదిగుండాలె.. చెప్పేది వినాలె.. ఇట్ల మిర్రమిర్ర అయితే నీకే కష్టం..) (మిర్రలు = ఎత్తయిన ప్రదేశం)
ఆన్గెపుకాయ = సొరకాయ ( మా పెరట్లోని యాపచెట్టుకు ఆన్గెపుతీగేసింది. ఆ ఆన్గెపుకాయలు బారెడు పొడవున్నాయి. వాటిని తొక్కువెట్టుకొని తింటుంటే ఉంది నా సామిరంగా..)
మిర్గులు = మిణుగురులు (బేటా మనం పొయ్యే తొవ్వల మిర్గులు మెరుస్తా ఉంటయి. భయపడకుంట అడుగుముందుకెయ్యాలె.. అర్తమైందా..?)
-డప్పు రవి