మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువత పునాది వంటిది. విజ్ఞానమే కేంద్రంగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఎదగడానికి ముందుకెళ్తున్న తరుణంలో యువత కీలకం కానున్నది. కనుక యువ జనాభా పెరుగుదలను సమస్యగా కాకుండా అవకాశంగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతీ, యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అనేక సర్వేలు పేర్కొంటున్నాయి. వారికి సరైన అవకాశాలు కల్పించి శ్రామిక శక్తిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా యువత ప్రాముఖ్యతతోపాటు వారి గళాన్ని తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి ఏటా వివిధ కార్య క్రమాలను నిర్వహిస్తున్నది. ప్రపంచ స్థాయిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్రియలలో యు వత భాగస్వామ్యాన్ని గుర్తు చేయడానికి ఐరాస అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ ఏడాది ప్రపంచ యువజన దినోత్సవ నినాదం సైతం దీన్ని నొక్కి చెబుతున్నది. దేశాభివృద్ధిలో యువత జనాభా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ, నేటి సమకాలీన పరిస్థితుల్లో నిరుద్యోగం, పేదరికం,నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలు యువతను పట్టి పీడిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి యువత కాలాన్ని వృధా చేస్తూ, పెడదారి పట్టిస్తున్నాయి. మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాల ఉచ్చులో యువ త చిక్కుకొని జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వ్యభిచారం, అక్రమ రవా ణా, బాల్య వివాహాలు, లింగ వివక్షత యువ మహిళా సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. రోజు రోజుకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి హత్యలు, అత్యాచారాలు, లైంగికదాడులవంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచంలోని మొత్తం జనాభాలో సగం జనాభా 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు. ఇది 2030 చివరి నాటికి 57శాతానికి చేరుకుంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పో షించే యువ జనాభా స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి ప్రపంచ యువజన నివేదిక-2020) పేరుతో వెలిబుచ్చిన పలు అం శాలు ప్రాధాన్యతను సంతరించుకున్నవి. ప్రపంచ దేశాలు ఎ జెండా 2030 ముందుకు తీ సుకెళ్ళే క్రమంలో యువత సామాజిక వ్యవస్థాపకత సూత్రాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతున్నది. నేడు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయ స్సు గల యువకులు ప్రపంచ జనాభాలో 16 శాతం ఉన్నారని, వీరు 2030 నా టికి 15.1శాతంగా, 2050 నాటికి 13.8 శాతానికి తగ్గుతారని అంచనాలు పేర్కొనగా, అభివృద్ధి చెందుతు న్న ఆఫ్రికా, ఆసియా దేశాలలో యువ జనాభా పెరుగుదల అధికంగా ఉంటుందని పేర్కొనడం ఈ దేశాల అభివృద్ధికి ఊతమిచ్చే విషయం. అంతేకాకుండా ప్రస్తుతం మన దేశంలో పనిచేసే యువకుల సాధారణ సగటు వయసు 29 సంవత్సరాలు. ఈ పరిణామం భారత్ లాంటి దేశానికి అందివచ్చే విషయం. అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ కార్మికుల్లో 96.8 శాతం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నారని పేర్కొనడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.
ఉపాధి, విద్య లేదా శిక్షణ లేని యువకుల నిష్పత్తి గత 15 ఏండ్లుగా దారుణంగా పెరిగిపోయిందని, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి రాబోయే 15 సంవత్సరాల్లో 60 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని ఇటీవల అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను దేశాభివృద్ధిలో భాగస్వా మ్యం చేయడానికి ప్రపంచ దేశాలు దీటైన వ్యూ హాలు రచించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక సారాంశం.
యువతను నైపుణ్యం గల శ్రామికశక్తిగా మా ర్చకపోతే వీరు సామాజిక అస్థిరతకు కారణమై జాతి భద్రతకు పెను సవాళ్లుగా మారుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని సమర్థవంతమైన మానవవనరులుగా మార్చడానికి ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు చేపట్టాలి. మరోవైపు హరితాభివృద్ధి దిశగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి హితవు పలుకుతున్న నేపథ్యంలో ‘ప్రపంచ యువజన నివేదిక’లో పేర్కొన్నట్టు లాభాపేక్ష లేని సామాజిక వ్యవస్థాపకతకు పెద్ద పీట వేయాలి .
-ఎస్. శ్యామల
80085 39905